తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా దిగుమతులపై భారత్​  సుంకాల మోత

అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతూ భారత్​ నిర్ణయం తీసుకుంది. పెంచిన సుంకాలు ఆదివారం నుంచి అమలు అవుతాయని స్పష్టం చేసింది.

By

Published : Jun 16, 2019, 5:46 AM IST

Updated : Jun 16, 2019, 10:30 AM IST

అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచిన భారత్​

అమెరికా దిగుమతులపై భారత్​ సుంకాల మోత

అమెరికాకు చెందిన 28 రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు భారత్​ ప్రకటించింది. ఉక్కు, అల్యూమినియం లాంటి భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందనగా భారత్​ ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికా ఉత్పత్తులపై పెంచిన ఈ సుంకాలు ఆదివారం నుంచి అమలులోకి వస్తాయని అధికారిక నోటీసు విడుదల చేసింది. భారత​ చర్య అమెరికా ఎగుమతిదారులకు నష్టం చేకూరుస్తుంది. వారు అధిక సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా ఆ వస్తువులకు భారత మార్కెట్లలో ధర అధికమవుతుంది.

2017, జూన్​ 30నాటి నోటిఫికేషన్​ను 'సెంట్రల్ బోర్డ్​ ఆఫ్​ ఇన్​డైరెక్ట్​ టాక్సెస్​ అండ్ కస్టమ్స్​' (సీబీఐసీ) సవరించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 28వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించామని తెలిపింది. అదే సమయంలో మిగతా దేశాల వస్తువులపై ఉన్న ఎమ్​ఎఫ్​ఎన్​ రేట్లను సంరక్షిస్తామని స్పష్టం చేసింది.

అర్టేమియా రొయ్య

ఇంతకు ముందు 29 అమెరికా ఎగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న భారత్​, తాజాగా ఆర్టేమియా అనే ఒక రకమైన రొయ్యను ఆ జాబితా నుంచి తొలగించింది.

అదనపు ఆదాయం..

అమెరికా వస్తువులపై సుంకాల పెంపుతో భారత్​కు 217 మిలియన్​ డాలర్ల అదనపు ఆదాయం లభిస్తుంది.

ప్రతీకారంగా..

ఉక్కు, అల్యూమినియం లాంటి కొన్ని భారత ఎగుమతులపై గణనీయంగా కస్టమ్స్​ సుంకాలను పెంచాలని అమెరికా నిర్ణయించింది. ఈ చర్యకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచాలని నిర్ణయించింది భారత్​.

2018 మార్చిలో భారత్​ నుంచి ఎగుమతి అవుతున్న స్టీల్​పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం పన్నులను అమెరికా విధించింది. అంతకు ముందు ఈ ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు లేకపోవడం గమనార్హం. సుంకాలు పెంచిన కారణంగా దేశీయ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై భారత్​ 240 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది.

'జీఎస్​పీ' రద్దు

భారత్​కు జనరలైజ్డ్​ సిస్టమ్ ఆఫ్​ ప్రిఫరెన్స్ (జీఎస్​పీ) కింద ఇస్తున్న ప్రోత్సాహాకాలను అమెరికా ఉపసంహరించుకుంది. ఇది జూన్ 5 నుంచి అమలవుతోంది. ఈ నేపథ్యంలో భారత్​ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న సుమారు 5.5 బిలియన్​ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ఈ ప్రభావం కనిపించింది.

ప్రతీకారంగా 28 అమెరికా ఉత్పత్తులపై భారత్​ సుంకాలు పెంచింది. వాల్నట్​పై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 120 శాతానికి, చిక్పీస్​, శనగలు, మసూర్​ పప్పులపై 30 నుంచి 70 శాతం, కాయధాన్యాలపై 40 శాతం సుంకాలు పెంచింది.

బోరిక్​ ఆమ్లం, బైండర్లపై 7.5 శాతం, దేశీయ కారకాలపై 10 శాతం సుంకాలు పెంచింది. అలాగే కొన్ని రకాల గింజలు, ఇనుము, స్టీల్, యాపిల్, పియర్స్​, స్టెయిన్​లెస్ స్టీల్​, అలోయ్ స్టీల్​, ట్యూబ్​, పైప్ ఫిట్టింగులు, స్క్రూలు, బోల్ట్​లు, రివర్టులపైనా సుంకాలు పెంచింది భారత్.

'డబ్ల్యూటీఓ'కు ఫిర్యాదు.

భారత్​... తన ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు పెంచడాన్ని సవాల్​ చేస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది.

భారత్​కే అనుకూలం..

ఏటా భారత్​ నుంచి సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి. భారత్​ నుంచి అమెరికాకు 2017లో 47.9 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్​ 26.7 బిలియన్​ డాలర్ల విలువైన ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంది. ఇది భారత్​కే అనుకూలం.

ఇదీ చూడండి: 'కరవుపై సమీక్ష-వ్యవసాయంలో నిర్మాణాత్మక సంస్కరణ'

Last Updated : Jun 16, 2019, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details