తెలంగాణ

telangana

ETV Bharat / bharat

35 ఏళ్ల తర్వాత భారత్​కు ఐఎల్​ఓ పీఠం

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పాలక మండలి అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అపూర్వ చంద్ర ఎన్నికయ్యారు. ఈ మేరకు భారత కార్మిక శాఖ వెల్లడించింది. 35ఏళ్ల తర్వాత ఐఎల్‌ఓ పాలకమండలి అధ్యక్ష స్థానం భారత్​కు దక్కింది.

By

Published : Oct 24, 2020, 7:44 AM IST

India Gets Chairmanship Of Governing Body Of International Labour Organisation
35ఏళ్ల తర్వాత ఐఎల్​ఓ కీలక స్థానంలో భారత్‌!

సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో భారత్‌ మరోసారి కీలక స్థానంలో చోటు సంపాదించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పాలక మండలి ఛైర్మన్‌గా భారత్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అపూర్వ చంద్ర ఎన్నికయ్యారు. ఈ మేరకు కార్మిక శాఖ వెల్లడించింది. '35ఏళ్ల తర్వాత ఐఎల్‌ఓ పాలకమండలి ఛైర్మన్​గా భారత్ బాధ్యతలు చేపట్టింది. కార్మికశాఖ కార్యదర్శిగా ఉన్న అపూర్వ చంద్ర అక్టోబర్‌ 2020-జూన్‌ 2021 వరకు ఈ స్థానంలో కొనసాగుతారు' అని భారత కార్మిక శాఖ తెలిపింది. భారత్‌- ఐఎల్‌ఓ మధ్య వంద సంవత్సరాల సుదీర్ఘ అనుబంధంలో ఇది నూతన అధ్యాయం అని కార్మిక శాఖ అభిప్రాయపడింది.

అంతర్జాతీయ కార్మిక సంస్థలో ఉన్న విభాగాల్లో పాలక మండలిది ముఖ్యమైన స్థానం. సంస్థ విధానాలు రూపొందించడం, అజెండా, బడ్జెట్‌తోపాటు ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ను ఎన్నుకోవడంలో పాలకమండలిదే కీలకపాత్ర. అందుకే దీనికి ఛైర్మన్‌గా ఎన్నిక కావడం అంతర్జాతీయంగా గొప్ప విషయంగా భావిస్తారు. ఇలాంటి స్థానాన్ని భారత్‌ మరోసారి చేపట్టింది. ఈ సంవత్సరం నవంబరులో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహించనున్నారు.

ప్రస్తుతం ఐఎల్‌ఓలో 187 సభ్య దేశాలున్నాయి. ఐక్యరాజ్యసమితి విభాగాలన్నింటిలో సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థగా ఐఎల్‌ఓకు పేరుంది. 1919లో ఏర్పడిన ఈ సంస్థ ఈ మధ్యే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details