తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బామ్మ స్పెషల్'​: రూపాయికే నాలుగు ఇడ్లీలు

నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్మే వారు ఉన్నారంటే నమ్మగలరా? కచ్చితంగా నమ్మలేం. ఎంత తక్కువ చూసినా ప్లేటు ఇడ్లీ 15 రూపాయలకంటే తక్కువకు దొరకడం కష్టం. కానీ తమిళనాడుకు చెందిన 80ఏళ్ల వృద్ధురాలు.. కేవలం రూపాయికే 4 ఇడ్లీలు అమ్ముతోంది. కష్టపడాల్సిన అవసరంలేకున్నా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోజు కూలీల కడుపు నింపుతోంది.

By

Published : Sep 12, 2019, 5:59 AM IST

Updated : Sep 30, 2019, 7:21 AM IST

'బామ్మ స్పెషల్'​: రూపాయికే నాలుగు ఇడ్లీలు

రూపాయికే నాలుగు ఇడ్లీలు

తమిళనాడులోని పేరూరు సమీపంలో వాదివేళంపాలాయం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కె.కమలాత్తాళ్‌. ఉదయాన్నే 6 గంటలకు ఆమె తన ఇంటిలోనే నిర్వహిస్తున్న హోటల్‌ తెరిచి ఇడ్లీలు విక్రయిస్తుంది. గత 30ఏళ్లుగా ఆమె ఈ హోటల్‌ను నిర్వహిస్తోంది. కేవలం రూపాయికే.. నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతోంది. ఆమె హోటల్‌వద్ద రోజూ భారీ సంఖ్యలో రోజువారీ కూలీలు, పేదలు క్యూకట్టి మరీ.. ఇడ్లీలు ఆరగిస్తారు.

కమలాత్తాళ్‌ది సాధారణ వ్యవసాయ కుటుంబం. కుటుంబసభ్యులంతా పొలం పనులకు వెళ్తుంటే ఆమె ఖాళీగా ఇంటి వద్ద ఉండేది. తానూ ఏదో ఒకటి చేయాలని యోచించిన ఆమె నిరుపేదలకు తక్కువ ధరకే ఇడ్లీలను అమ్మాలనే నిర్ణయంతో 30 ఏళ్ల క్రితం హోటల్‌ను ప్రారంభించింది. తొలుత నాలుగు ఇడ్లీలను కేవలం 50 పైసలకే విక్రయించేది. ఈమధ్యనే ఆ ధరను రూపాయికి పెంచింది.

6 గంటలకే అంతా సిద్ధం...

ఒక రోజు ముందే సరుకులన్నీ సిద్ధం చేసుకొనే ఈ బామ్మ ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే.. ఇడ్లీలూ, చట్నీ తయారుచేస్తుంది. తమ పొలంలో పండే కూరగాయలతో చాలా రుచికరంగా సాంబారు తయారు చేస్తుంది. మొదట్లో పిండిని స్వయంగా రుబ్బేది. ఇటీవలే గ్రైండర్‌ను సమకూర్చుకుంది. కట్టెల పొయ్యి మీదనే ఇడ్లీలు వేస్తూ వచ్చినవారికి వేడివేడిగా అందిస్తుంది.

రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ... ఆమె వద్దకు వచ్చి ఇడ్లీలు తినేవారి సంఖ్య భారీగా ఉంటుంది. అలా వచ్చే వారంతా రోజు కూలీలే ఉంటారు.

'ధరలు పెంచేదే లేదు'

రోజుకు వెయ్యి ఇడ్లీలకుపైగానే విక్రయించే బామ్మను చాలా మంది ధర పెంచమని కోరినా పట్టించుకోలేదట. భవిష్యత్తులోనూ.. ధరను పెంచేదిలేదని కమలత్తాళ్‌ స్పష్టంచేస్తోంది. 80 ఏళ్ల వయసులో ఎందుకీ కష్టం, హోటల్‌వద్దని తన మనుమలు చెప్పినా సరే ఆమె వినడంలేదు. ఈ పని వల్లే.. తానింకా చలాకీ ఉన్నట్లు బామ్మ చెబుతోంది.

ఖర్చులు పోను రోజూ తనకు ఎంతోకొంత మిగులుతుందన్న బామ్మ తక్కువ ధరకే పేదలు కడుపునింపడం ఎంతో సంతృప్తినిస్తోందని చెబుతోంది. రోజూ తన వద్దకు వచ్చేవారి కోరిక మేరకు ఇటీవల కమలత్తాళ్ బామ్మ మైసూర్ బోండాను కూడా వండి పెడుతోంది. నాలుగు బోండాలను కేవలం రెండున్నర రూపాయలకే బామ్మ అందిస్తోంది.

బామ్మ వద్దకు వచ్చే పేదలు.. కడుపునిండా తిని ఆనందంతో వెళుతుంటారు. ఈ వయసులోనూ బామ్మ చలాకీ తనం చూసి తాము ఆశ్చర్యపోతుంటామని.. స్థానికులు చెబుతున్నారు.

Last Updated : Sep 30, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details