తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2020, 4:56 PM IST

ETV Bharat / bharat

గేమ్​ ఛేంజర్​ 'రఫేల్'​ ఎందుకింత ప్రత్యేకం?

భారత్​ ఎంతగానో ఎదురుచూస్తున్న రఫేల్​ యుద్ధవిమానాలు బుధవారం దేశంలో అడుగుపెట్టనున్నాయి. దీనితో వాయుసేన మరింత శక్తిమంతంగా మారనుంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇవి రావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు రఫేల్​ ఎందుకింత ప్రత్యేకం? ఈ విమానాలను వెంటనే వినియోగించవచ్చా? వీటిని ఎక్కడ మోహరించనున్నారు?

IAF's Rafale fighters will touchdown in plug and play condition for  fast deployment
గేమ్​ ఛేంజర్​ 'రఫేల్'​ ఎందుకింత ప్రత్యేకం?

ఇప్పుడు దేశ ప్రజల చూపంతా 'రఫేల్​'పైనే. ఎన్నో అంచనాల మధ్య రఫేల్​ యుద్ధ విమానాలు బుధవారం భారత్​లో అడుగుపెట్టనున్నాయి. చైనాతో సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో వాయుసేనకు రఫేల్​ అందుబాటులోకి రావడం దేశానికి అత్యంత సానుకూల విషయం. ఎన్నో విశిష్టతలున్న ఈ రఫేల్​ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...

అసలేంటి ఈ రఫేల్​?

లాంగ్‌ రేంజ్‌ మిటియార్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులు కలిగిన అత్యాధునిక యుద్ధ విమానమే ఈ రఫేల్. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణుల సొంతం. శత్రువులపై పోరాటంలో రఫేల్​ ఓ గేమ్​ఛేంజర్​గా మారనుందని వాయుసేన ధీమాగా ఉంది.

ఒప్పందం ఎప్పుడు జరిగింది?

వైమానిక దళం అవసరాలు తీర్చడానికి 36 రఫేల్‌ యుద్ధ విమానాల కోసం.. 2016 సెప్టెంబర్‌లో భారత్ రూ. 60వేల కోట్లతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎన్ని వస్తున్నాయ్​?

తొలి బ్యాచ్​లో భాగంగా 5 యుద్ధ విమానాలు సోమవారం ఫ్రాన్స్​ నుంచి బయలుదేరాయి. ఇవి బుధవారం దేశంలో అడుగుపెడతాయి. ఫలితంగా ఫ్రాన్స్​, ఖతార్​, ఈజిప్ట్​ దేశాల తర్వాత రఫేల్​ యుద్ధవిమానాలు కలిగిన నాలుగో దేశంగా భారత్​ అవతరించనుంది.

ఎవరైనా నడపొచ్చా?

రఫేల్​ యుద్ధ విమానాలు నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే ఓ బ్యాచ్ ఫ్రాన్స్​లో​ శిక్షణ పొందింది. త్వరలోనే మరో బ్యాచ్​ ఫ్రాన్స్​కు వెళ్లనుంది.

విధులు నిర్వహించడానికి సిద్ధమేనా?

రఫేల్​ను అత్యాధునిక పరికరాలతో రూపొందించింది ఫ్రాన్స్​. విమానానికి సంబంధించిన చాలా భాగాలను తయారీ దశలోనే అమర్చింది​. అందువల్ల భారత్​లో అడుగుపెట్టగానే ఉపయోగించడానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. అయితే విమానాలకు వాయుసేన ఇంకొన్ని మార్పులు చేయనుంది.

ఎప్పుడు ఎగరనున్నాయి?

దేశంలోకి అడుగుపెట్టగానే ఉపయోగించే విధంగా యుద్ధ విమానాలు అందుబాటులోకి రావడం భారత్​కు సానుకూల విషయం. అందువల్ల తుది మెరుగులు దిద్దిన అనంతరం.. కొద్ది వారాల్లోనే విధులు నిర్వహించడానికి రఫేల్​ సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.

తుది మెరుగులు ఎలా ఉండనున్నాయి?

దేశీయ సాంకేతికతతో రూపొందించిన 'నావిక్​' నావిగేషన్​ వ్యవస్థను రఫేల్​కు జోడించనున్నారు. ఎమ్​88-4ఈ ఏరో ఇంజిన్​ను కూడా అమర్చనున్నారు. దీని వల్ల ఎత్తైన, ఆక్సిజన్​ తక్కువగా ఉండే లేహ్​ లాంటి ప్రాంతాల్లోనూ పైలట్లు సులభంగా విమానాలను నడపగలరు. దీనితో పాటు ఆధునిక వాతావరణ వ్యవస్థ, దేశీయ 'అస్త్రా' వంటి క్షిపణులను జోడించేందుకు వీలుగా రఫేల్​లో మార్పులు చేయనున్నారు. వీటన్నిటితో పాటు యుద్ధ విమానాలకు మరింత శక్తి, సామర్థ్యాలను చేకూర్చేందుకు ఇప్పటికే హ్యూమర్​ క్షిపణులను ఫ్రాన్స్​ నుంచి కొనుగోలు చేసింది రక్షణశాఖ.

ఎక్కడ మోహరించనున్నారు?

తొలి బ్యాచ్​ రఫేల్​ యుద్ధ విమానాలను భారత్​-పాక్​ సరిహద్దుకు సుమారు 220 కిలోమీటర్ల దూరంలోని అంబాలా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. రెండో బ్యాచ్​లో వచ్చే ఎయిర్​క్రాఫ్ట్​లను బంగాల్​లోని హసిమారా స్థావరానికి తరలిస్తారు.

ఇదీ చూడండి:-రఫేల్​ రాకతో.. గగనతలంలో సవాళ్లకు భారత్​ సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details