ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా విద్యుత్తురంగం గుండెకాయ వంటిది. ఒకప్పుడు విద్యుత్తు లోటుతో కునారిల్లిన భారత్, విద్యుత్తును ఎగుమతిచేసే స్థాయికి ఎదిగింది. ఈ ఘనత కోసం అన్ని ప్రభుత్వాలూ తమవంతు కృషి చేశాయి. మోదీ ప్రభుత్వం దీన్ని మరింత పరుగులు పెట్టించింది. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్తు పంపిణీని సాకారం చేసింది. సౌభాగ్య పథకంతో ప్రతి ఇంటినీ అనుసంధానించగలిగింది. అన్ని గ్రామాలకు, ఇళ్లకు నాణ్యతగల విద్యుత్తును నిరాటంకంగా సరఫరా చేయడంలో మాత్రం ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంది. ఈ విషయంలో ప్రపంచ ర్యాంకుల్లోనూ భారత్ వెనకబడి ఉంది. అందుకే ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రూ.102 లక్షల కోట్ల ప్రణాళికలో దాదాపు రూ.25 లక్షల కోట్లు విద్యుత్తు రంగానికే ప్రత్యేకించారు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చారు.
వచ్చే అయిదేళ్లలో మొత్తం విద్యుత్తులో దాదాపు 40 శాతం పర్యావరణ హితకర పునరుత్పత్తి ప్రాజెక్టుల ద్వారానే జరగాలని ప్రణాళిక వేసుకున్నారు. అందుకోసం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మొత్తం విద్యుత్తులో 47 శాతం ప్రైవేటు రంగంలోనే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం ఈ రంగం ఎన్నో సమస్యలతో సతమవుతోంది. విద్యుదుత్పత్తి సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మొదటగా సంప్రదాయ ఉత్పత్తి సంస్థలు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు పడుతున్నాయి. రెండోది, ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బాకీలు పంపిణీ సంస్థలనుంచి రాకపోవడం. మూడోది, ఉత్పత్తికి తగ్గ గిరాకీ లేకపోవడం. విద్యుత్తు సరఫరా, పంపిణీ సంస్థల్లోని లోటుపాట్లే
గణనీయ మార్పులు
విద్యుత్ సరఫరా రంగంలో గత కొన్నేళ్లలో గణనీయ మార్పులొచ్చాయి. ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఒకే గ్రిడ్కు అనుసంధానం చేయగలిగారు. ఇదో పెద్ద ముందడుగు. ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సంస్కరణలు కొంతమేర సంతృప్తికరంగా ఉన్నా- పంపిణీ రంగంలో ఇంకా అనేక లోటుపాట్లు ఉన్నాయి. పంపిణీ సంస్థలు గత నవంబరుకు రూ.81,085 కోట్లు ఉత్పత్తి సంస్థలకు బాకీ పడ్డాయి. వీటన్నింటి ప్రభావం బ్యాంకులపైనా ఉంది. విద్యుత్ సంస్థలకిచ్చిన అప్పులు నిరర్ధక ఆస్తులుగా మారి బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అందుకే ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
మూడు భాగాలుగ సంస్కరణలు
మొత్తం సంస్కరణలను మూడు రకాలుగా విభజించారు. మొదటిది, నిర్మాణపరమైనవి. ఆరంభం నుంచే ప్రధాని మోదీ వీటికి శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యమైనది- విద్యుత్తు నియంత్రణ కమిషన్ ఏర్పాటు. ధరల నిర్ణయాధికారం ఈ కమిషన్కే ఉంటుంది. రెండోది, నిర్వహణ సంస్కరణలు. ఇందులో భాగంగా వినియోగదారుడు ఎవరినుంచైనా విద్యుత్తును కొనుగోలు చేసే ‘ఓపెన్ యాక్సిస్’ విధానాన్ని తీసుకొచ్చారు. అన్ని గ్రామాలకు, ఇళ్లకు విద్యుత్ సరఫరా పథకాలు, పట్టణాల్లో సమగ్ర విద్యుత్తు అభివృద్థి పథకం ఇందులో భాగమే. చివరి అంచె ఆర్థిక సంస్కరణలు. ఆర్థికంగా కునారిల్లుతున్న పంపిణీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ‘ఉదయ్’ పథకం ద్వారా కొంత ఊరట కలిగించారు. అన్ని రాష్ట్రాల పంపిణీ సంస్థలు (ఒక్క పశ్చిమ్ బంగ తప్ప) ఈ పథకాన్ని ఉపయోగించుకున్నాయి.
విద్యుత్ కష్టాలు
మొదట్లో పంపిణీ సంస్థలు కొంతమేర గాడినపడినా తిరిగి కష్టాల్లో కూరుకుపోయాయి. వీటి ఆర్థిక క్రమశిక్షణ కోసం నిరుడు కేంద్రం కొత్త పథకం తెచ్చింది. దాని ప్రకారం పంపిణీ సంస్థలు పరపతి పత్రం ఇస్తేనే ఉత్పత్తి సంస్థలు విద్యుత్తును సరఫరా చేస్తాయి. ఇది అమలు చేసిన తరవాత ప్రస్తుత బకాయిలు పెద్దగా లేవు. పాత బకాయిలు మాత్రం అలానే ఉన్నాయి. మొత్తం విద్యుత్తురంగంలో బలహీనమైన ‘లింక్’ పంపిణీ సంస్థలే. దీనికి అనేక కారణాలున్నాయి. వీటిపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వాలది. వసూళ్లు పకడ్బందీగా లేకపోవడం, విద్యుత్తు కొనుగోళ్లలో వ్యత్యాసాలు, విద్యుత్తు టారిఫ్ నిర్ణయాల్లో అశాస్త్రీయత, రాయితీ చెల్లింపులు రాష్ట్రాలు సకాలంలో చేయకపోవడం, ప్రభుత్వ శాఖలే బకాయిలు పడటం... వంటి సమస్యలు పంపిణీ సంస్థలను వెంటాడుతున్నాయి. దీనికితోడు సరఫరా, వాణిజ్య నష్టాలు మోతాదుకు మించి ఉంటున్నాయి. ఈ సంస్థలు రెండు నెలల నుంచి 15 నెలల వరకు ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడంతో విదేశీ సంస్థలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి.
రాష్ట్రప్రభుత్వాల అజమాయిషీ
పంపిణీ సంస్థలు అన్నీ ఒకలా లేవు. దేశవ్యాప్తంగా 41 సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో ఉన్నాయి. వీటిని ఆరు రకాల గ్రేడుల్లో వాటి ప్రామాణికాలను పోల్చుతున్నారు. అందులో ఏడు మాత్రమే పైర్యాంకుల్లో ఉన్నాయి. ఇంకో తొమ్మిది రెండోస్థానంలో నిలిచాయి. మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాల పంపిణీ సంస్థలు లేవు. రెండో కేటగిరీలో ఏపీకి చెందిన తూర్పు పంపిణీ సంస్థ ఉంది. మిగతావి మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి. వార్షిక తలసరి వినియోగం చూస్తే ప్రాంతీయ వ్యత్యాసాలు అధికంగా కనిపిస్తున్నాయి. దేశ సగటు 1,181 కిలోవాట్లు ఉంటే పశ్చిమ ప్రాంతం అత్యధికంగా 1,573 కిలోవాట్లు వాడుకుంటోంది.