తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండోరోజూ వరుణుడి బీభత్సం...32 మంది మృతి

వరుసగా రెండోరోజూ దేశంలోని పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరుణుడి బీభత్సానికి కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్కరోజే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, మహారాష్ట్రలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరదల బీభత్సానికి కేరళలోని 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

By

Published : Aug 10, 2019, 6:47 AM IST

Updated : Aug 10, 2019, 9:11 AM IST

రెండోరోజూ వరుణుడి బీభత్సం...32 మంది మృతి

వరుణుడి బీభత్సం

వరుణుడు వరుసగా రెండో రోజూ తన ప్రతాపాన్ని చూపాడు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్​లలో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నీటిలో చిక్కుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

కేరళ విలవిల..

కేరళలో వరదల కారణంగా శుక్రవారం ఒక్కరోజే 20 మంది మృతిచెందారు. మొత్తం 14 జిల్లాలకు గానూ 9 జిల్లాల్లో రెడ్​ అలర్ట్ ప్రకటించారు. గత మూడు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 28కి పెరిగింది. 24 చోట్ల కొండ చరియలు విరిగిపడి 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన 13 బృందాలు, 180 మంది సైనిక అధికారులు, 16 కోస్టు గార్డు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 64 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వయనాడ్​లో పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించాలని కోరారు.

మహారాష్ట్రలో ప్రజల ఇక్కట్లు

మహారాష్ట్రలో గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ, పంచగంగ సహా పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోల్హాపూర్​, సంగ్లీ సహా పశ్చిమ మహారాష్ట్రలో జలమయమైన 5 జిల్లాల నుంచి 2.85 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కోల్హాపుర్​లో 34, సంగ్లీలో 36 బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

కాంగ్రెస్ నేతల విరాళం

రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయార్థంగా తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసహెబ్​ థోరట్​.

కర్ణాటకలో దయనీయ పరిస్థితి

కర్ణాటకలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. ఇప్పటివరకు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న లక్షా 24 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెళగావి జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ప్రభావిత జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఆగస్టు 15 వరకు సెలవులు ప్రకటించారు.

వరద బాధితుల సహాయార్థం జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

మధ్యప్రదేశ్​, ఒడిశాల్లోనూ...

మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమై రవాణా వ్యవస్థ స్తంభించింది. నర్మదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రానున్న 24 గంటల్లో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇదీ చూడండి:వంతెన పైకి బైక్​లో వెళ్లి​.. క్షణాల్లో వరదలో కొట్టుకుపోయారు!

Last Updated : Aug 10, 2019, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details