తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2019, 11:44 PM IST

Updated : Oct 2, 2019, 8:08 PM IST

ETV Bharat / bharat

గాంధీ 150: వ్యాసాలు, రచనలతో గళమెత్తిన మహాత్ముడు

స్వాతంత్ర్య పోరాటంలో అహింస, సత్యాగ్రహంతో పాటు మహాత్మాగాంధీ విరివిగా ఉపయోగించిన ఆయుధం.. కలం. ఉద్యమకార్యాచరణ ప్రజలకు చేరడానికి, జాతీయభావజాలం ప్రోది చేయటానికి అక్షరప్రవాహంతో చైతన్యం రగిలించారు... బాపూ. జాతీయోద్యమాన్ని తన భుజస్కంధాలపైకి తీసుకున్న అనంతరం.. పత్రికల ప్రాముఖ్యత గుర్తించి.. ఆంగ్లేయులపై శరపరంపరగా దాడిని కొనసాగించారు. తుదిశ్వాస వరకూ పత్రికల్లో వ్యాసాలు, రచనలతో ప్రజా సమస్యలపై గళమెత్తారు. నిబద్ధత గల పాత్రికేయునిగా, సంపాదకుడిగా ఎనలేని సేవలందించారు.

గాంధీ 150: వ్యాసాలు, రచనలతో గళమెత్తిన మహాత్ముడు

గాంధీ 150: వ్యాసాలు, రచనలతో గళమెత్తిన మహాత్ముడు

''ప్రజల అభిప్రాయాన్ని మలచటంలో, వారి మద్దతు సమీకరించటంలో సమాచారమాధ్యమాలు తిరుగులేని సాధనాలు''

స్వాతంత్ర్యసంగ్రామంలో ఇదేమాట త్రికరణశుద్ధిగా నమ్మారు మహాత్మాగాంధీ. నిజానికి విద్యార్థిదశ నుంచే తనలోని జర్నలిస్ట్‌కు సానపడుతూ వచ్చారు. లండన్‌లో చదివేటప్పుడు 'ద వెజిటేరియన్‌' అనే ఆంగ్ల వారపత్రికకు ఫ్రీలాన్సర్‌గా 9 కథనాలు రాసిన బాపూ.. అప్పటి నుంచే సరళమైన భాషలో జనానికి చేరువకావటం అలవర్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన మూడవ రోజే కోర్టులో జరిగిన తీవ్ర అవమానం గురించి స్థానికపత్రికలో ఓ వ్యాసం రాశారు. ఈ విషయం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లటంతో పత్రికా స్వేచ్ఛ ఉందని గ్రహించి... ఆయనను రచనా వ్యాసంగంవైపు నడిపించింది.

పాత్రికేయునిగా, వ్యాసకర్తగా, రచయితగా గాంధీజీ ప్రయాణం దక్షిణాఫ్రికాలో 1903లో మొదలై తుదికంటా సాగింది. 1903 నుంచి 1914 వరకూ, తిరిగి 1919 నుంచి 1948లో తుదిశ్వాస విడిచే వరకూ.. గుజరాతీ, ఆంగ్లంతో పాటు వివిధ భాషల్లో మహాత్ముడు వారపత్రికలు ప్రచురించారు. యంగ్‌ ఇండియా, నవజీవన్‌, హరిజన్‌, ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికల ద్వారా గాంధీజీ చేసిన ప్రయత్నం.. ఇతర నాయకుల నుంచి ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. 'ఇండియన్‌ ఒపీనియన్‌' పత్రిక లేకుండా సత్యాగ్రహం అసాధ్యం అని ఆయన విశ్వసించేవారు గాంధీ. ప్రజల మనిషి గా వారి కష్టాలు, నష్టాలు, ఆకాంక్షలు.. అన్నింటి గురించి విస్తృతంగా రాసేవారు.

పాత్రికేయులకు ఉండాల్సిన లక్షణాలేంటో తెలుసా..

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్వాతంత్య్రం ఎంత అవసరమో.. తన రచనల ద్వారా ప్రజలకు చేరవేయాలని తపించేవారు గాంధీజీ. పత్రికలు, పాత్రికేయులకు 3 లక్షణాలు ఉండాలని నమ్మేవారు. ప్రజలభావాల్ని అర్థం చేసుకుని వాటికి అక్షరరూపం ఇవ్వటం, ప్రజల భవిష్యత్‌కు అవసరమైన ఉద్వేగాలు తట్టిలేపటం, వ్యవస్థల లోటుపాట్లు నిర్భీతిగా ఎత్తిచూపటం చేయాలని కోరుకునే వారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని పోరుబాట పట్టించటమే వీటి ఉద్దేశ్యం. 4 దశాబ్దాల పాత్రికేయజీవితంలో నమ్మిన 3 సిద్ధాంతాల్ని ఏనాడూ బాపూజీ విడిచిపెట్టలేదు.

తన కథనాల ద్వారా ప్రభుత్వాలకు ఇచ్చే విన్నపాలు, విజ్ఞప్తుల్లో జర్నలిస్ట్‌గా గాంధీజీ చూపిన తెగువ స్పష్టంగా కనిపించేది. 1894 అక్టోబర్‌ 25న 'టైమ్స్‌ ఆఫ్‌ నేటల్‌'కు 'రామీ సామీ' పేరుతో రాసిన సంపాదకీయంలో ఈ ధిక్కారం గమనించవచ్చు. అందులోని ఓ వాక్యం ఇలా ఉంటుంది. ‍

''మీరు బయట కనిపించే చర్మాన్నే చూస్తారు. మీకు చర్మం తెల్లగా ఉంటే చాలు. దాని మాటున విషముందా, తేనె ఉందా అనే పట్టింపు మీకు లేదు.''

ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికలో పనిచేసిన సంపాదకుల్లో ఒకరు మినహా అందరూ జైలు జీవితం గడిపినవారే.

స్ఫూర్తిమంతమైన కథనాలతో చైతన్యం...

1906 వరకు మితవాద ధోరణిలోనే సాగిన ఇండియన్‌ ఒపీనియన్‌.. తర్వాత ధిక్కార స్వరం వినిపించింది. 1906 సెప్టెంబర్‌ నుంచి భారతీయుల పోరాటాలు, ప్రతిఘటన, స్ఫూర్తిమంతమైన కథనాలు ప్రచురించడం ద్వారా బ్రిటీష్‌ ప్రభుత్వానికి మింగుడుపడని స్థాయికి చేరింది. అన్యాయంపై పోరాడేందుకు త్యాగాలకు సిద్ధమై ముందుకు రావాలని ఇండియన్‌ ఒపీనియన్‌.. ప్రజల్ని బహిరంగంగా కోరింది. 1909లో 177 రోజులపాటు గాంధీజీ గడిపిన జైలు జీవితం, ఇతర నాయకుల కారాగారాల గాథలను ప్రజలకు అందించి అవగాహన కల్పించింది.

మొదట.. ఇండియన్ ఒపీనియన్‌ దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం మొదలై అక్కడి నల్ల జాతీయులకూ అండగా నిలిచి ఆఫ్రికన్ పోరాటాలకు మద్దతునిచ్చింది. 1950 తర్వాత గాంధీజీ రెండవ కుమారుడు మణిలాల్‌గాంధీ నేతృత్వంలో సామాజిక, రాజకీయ పరిధిలో విస్తృత కథనాలు ప్రచురించింది. అహింస, సత్యాగ్రహం మొదలైన మహాత్ముడి సిద్ధాంతాల ప్రచారానికి ఇదొక సాధనంగా మారింది. 1961 ఆగస్ట్‌ 4న ఇండియన్ ఒపీనియన్‌ చివరి సంచిక వెలువడింది.

పాత్రికేయ వృత్తిలో విలువలు నెలకొల్పిన గాంధీజీ...

ఓ పత్రికగా 'ఇండియన్‌ ఒపీనియన్', ఓ పాత్రికేయునిగా, సంపాదకుడిగా గాంధీజీ పోషించిన పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలిచింది. జర్నలిస్ట్‌గా ఏ సందర్భంలోనైనా ఆయన ఒకటే చెప్పేవారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే సంచలనాలకు దూరంగా వాస్తవాలకే పరిమితం అవ్వమనేవారు. పాఠకులను గందరగోళానికి గురిచేయకుండా వారికి అవసరమైన విషయాల్లోనే అవగాహన కల్పించమని సూచించేవారు. అలా భారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాక నిబద్ధత, అంకితభావం కలిగిన పాత్రికేయుడిగానూ మహాత్ముడు చెరగని ముద్ర వేశారు. నైతికత, నిబద్ధత, అంకితభావం గల పాత్రికేయుడిగా తిరుగులేని పాత్ర పోషించారు. పాత్రికేయ వృత్తిలో గాంధీజీ నెలకొల్పిన విలువలు వార్త ప్రచురణ, ప్రసారసంస్థలకు ఓ నమూనా.

ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ

Last Updated : Oct 2, 2019, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details