తెలంగాణ

telangana

By

Published : Aug 22, 2019, 7:00 AM IST

Updated : Sep 27, 2019, 8:29 PM IST

ETV Bharat / bharat

గాంధీ 150: ఆలోచన, ఆచరణ, సహనంతోనే శాంతి

ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్లినా... అంతటా అశాంతే. దేశాల మధ్య పరస్పర నమ్మకానికి అర్థమే లేదు. సహనానికి తావులేదు.  ద్వైపాక్షిక చర్చలు ఒట్టిమాటలైపోయాయి. అనుమానాలు, అసహనాలు, భయాలు.. అవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. అగాధాన్ని మరింత పెద్దది చేస్తున్నాయి. రోజురోజుకూ సహనం, శాంతి దిగజారిపోతోంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అశాంతికి 7 దశాబ్దాల క్రితమే మహాత్ముడు సమాధానం చెప్పారు. కానీ.. ఏ ఒక్క దేశం ఆయన బాటలో ముందడుగు వేయడం లేదు. అందుకే ప్రపంచశాంతి త్రిశంకుస్వర్గమైంది. దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే ఏం చేయాలి..? మహాత్మాగాంధీ ఏం చెప్పారు..?

గాంధీ 150: ఆలోచన, ఆచరణ, సహనంతోనే శాంతి

దాయాదుల పోరు, అంతర్యుద్ధాలు, దురాక్రమణలు, ఒప్పందాల ఉల్లంఘనలు... ప్రపంచశాంతి ప్రమాదంలో పడేందుకు కారణాలు. వీటన్నింటి నుంచి ప్రపంచం బయటపడలేదా..? అసలు ప్రపంచశాంతి అంటే ఏమిటి..? అది అర్థం కాని జడపదార్థమా...? కానేకాదు. అన్ని దేశాలు పరస్పర సహకారంతో కలిసి నడవడమే.. ప్రపంచశాంతి.

యుద్ధాన్ని నివారించాలి. అహింస పాటించాలి. ఆ దిశగా బాధ్యతాయుతమైన దేశాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అప్పుడే ప్రపంచశాంతి సాధ్యం. మరి ప్రపంచం అలా ఉందా..? అంటే లేనేలేదు. పూర్తి విరుద్ధంగా ఉంది. పరస్పర సహకారం మాటేమో గానీ.. విభేదాలు మాత్రం ఉన్నాయి. ఎక్కడ చూసినా ఘర్షణలే. అంతర్జాతీయ సరిహద్దు, జాతి వైరుద్ధ్యాలు, మత ఛాందసవాదం, నదీ జలాల వివాదాలపై దశాబ్దాలుగా పరస్పర ఆరోపణలే. సంప్రదింపులు, చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలనే తీర్మానాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం ఉండటం లేదు.

ప్రపంచ దేశాలు సిద్ధంగాలేవా..?

అనుమానాలు, భయాలతో బతుకుతున్న ప్రపంచదేశాలకు గాంధేయవాదమే సరైన పరిష్కారం. దేశాలకు అతీతంగా బాపూజీని ఆరాధిస్తున్నప్పటికీ.. మహాత్ముడి తత్వాన్ని మాత్రం ఆచరించడం లేదు. ప్రపంచశాంతికి గాంధేయవాదం ఓ పరిష్కారమని భావించడం లేదు. గాంధీ విధానాలు నేటికాలానికి సరిపోవని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. శాంతియుతంగా, అహింసా పద్ధతిలో గాంధీజీ పోరాటం చేసినప్పటి కంటే.. ఇప్పటి విభేదాల్లోని సంక్లిష్టత ఎక్కువనే ఆలోచనలో ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక అంశాలకే గాంధీ భావజాలం ఉత్తమ పరిష్కారమని భావిస్తున్నాయి. కానీ.. గాంధేయతత్వం, అంహిసా విధానంపై వాస్తవానికి వచ్చి ఆలోచిస్తే.. అందులోని ఔచిత్యం అర్థమవుతుంది. అందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.

బాపూ రచనలు, సూచనలే మార్గం...

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, సంఘర్షణలకు 7 దశాబ్దాల క్రితమే బాపూజీ పరిష్కారం చూపారు. ఆయన ఆచరణపై లోతైన ఆలోచనలు చేసి, విశాల దృక్పథంతో విశ్లేషణ చేస్తే.. అప్పటి పరిస్థితులు, నేటి స్థితిగతుల మధ్య పోలిక కనిపిస్తుంది. నాడు గాంధీ ఏం చేశారో.. ఇప్పడేం చేయాలో తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేయకపోవడం వల్లే.. హింసను ఎదుర్కోవడం, శాంతి నెలకొల్పడంలోని వైఫల్యం అణువణువునా కనిపిస్తుంది. వివిధ సందర్భాల్లో శాంతిపై గాంధీ రాసిన వ్యాసాలు, ఆయన చేసిన సూచనలు.. సమకాలీన ప్రపంచంలో వివిధ దేశాల మధ్య నెలకొన్న విభేదాలకు.. ఉత్తమ పరిష్కారాలు.

మూడో పక్షం జోక్యం అనవసరం...

ఆయన కాలంలో అంతర్జాతీయ విభేదాల పరిష్కారానికి గాంధీజీ అవలంబించిన పద్ధతులు ప్రస్తుత కాలానికి సరిపోతాయి. “ఎలాంటి వివాదాన్ని అయినా పరిష్కరించేందుకు తొలుత మనం చేయాల్సిన పని.. సహనంతో, స్నేహపూర్వక వాతావరణంలో ప్రయత్నాలు చేయాలి. లేదంటే.. ఇద్దరి మధ్య విభేదాల పరిష్కారం మూడో వ్యక్తి నిర్ణయంపై ఆధారపడేలా చేస్తుంది. సహనంతో ఉంటే... మూడోపక్షం జోక్యాన్ని నివారించవచ్చు. ”

సహనంతో ఉంటే... సామాజిక, జాతి, మత, రాజకీయ అంశాల ఆధారంగా విభేదాలు పరిష్కరించవచ్చని గాంధీజీ బలంగా నమ్మేవారు. సహనం నశిస్తున్నప్పుడే.. శాంతి ప్రమాదంలో పడుతుంది. విభేదాలకు అసలు కారణాన్ని గుర్తించాలి. అప్పుడే విభేదాల్లో అస్పష్టంగా ఉన్న సరైన లక్షణం కనిపిస్తుంది. అప్పుడే గాయానికి ఏ ఔషధం వాడాలో తెలుస్తుంది.

గాంధీజీ జీవించిన కాలానికి.. ఇప్పటికీ చాలా అంశాల్లో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ముఖ్యంగా శాంతి విషయంలో.. అప్పుడు, ఇప్పుడు ప్రభుత్వాలు ఒకే తీరుగా ప్రవర్తిస్తున్నాయి. దేశంలో అంతర్గతంగా నెలకొంటున్న అశాంతిని రూపుమాపేందుకు ఆయా ప్రభుత్వాలు అనుసరించే విధానాలను గాంధీజీ తప్పుపట్టారు. ప్రజలపై ఉక్కుపాదం మోపే పౌర ప్రభుత్వ తీరును హింద్‌ స్వరాజ్‌కి రాసిన వ్యాసంలో బాపూజీ నిరసించారు. తమ దేశంలో ప్రశాంతంగా ఉండటం కోసం.. సరిహద్దు దేశాలతో నిరంతరం ఘర్షణపడటం.. అత్యున్నత ప్రజాస్వామ్య పౌర ప్రభుత్వానికి తగదని గాంధీ హితవు పలికారు.

శాంతియుతంగా ప్రయత్నిస్తున్నారా...?

ఘర్షణలు, తుపాకుల శబ్దాలతో శాంతి నెలకొనదు. కానీ.. అసమానతలు ఎదుర్కొంటున్న నిరాయుధ దేశాలకు న్యాయం చేయాలి. అహింసాయుత పద్ధతిలో శాంతిని నెలకొల్పేందుకు ఇదొక అవకాశం. దురదృష్టవశాత్తు... విభేదాలు వచ్చినప్పుడు శాంతి నెలకొల్పేందుకు చాలా తక్కువ దేశాలే ఇలాంటి విధానాలను పాటిస్తున్నాయి. అలాంటి దేశాలు.. ముల్లును ముల్లుతోనే తీయాలనే బలమైన దేశం ముందు లొంగిపోక తప్పదు.

ఈ రోజుల్లో.. దాయాది దేశాల మధ్య సంఘర్షణలు, స్పర్ధలు ఊహించని స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. శాంతి, అహింస పాటిస్తూ.. పరస్పర నమ్మకంతో.. ఘర్షణల పరిష్కారానికి చర్చలు జరపాలనే ఉదాత్తమైన ఆదర్శాలను ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయా... అంటే లేదనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తాయి.

శాంతిదూతలెందరో..

ఘర్షణలు పడకుండా, అవగాహనతో, చర్చలతో, సహనంతో... మార్పు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు వ్యక్తులు సరైన ఆలోచనలు, ఆచరణతో.. మార్పులకు నాంది పలికారు. సమాజగతిని మార్చేశారు. అలాంటి శాంతిదూతలు ఇప్పటికీ ఉన్నారు. నిరూపమైన వారి సేవలకు గానూ.. నోబెల్‌ శాంతి బహుమతి పొందారు. 2008లో మార్తి అతిసారి, 2006లో మహమ్మద్‌ యూసుఫ్‌, 2004లో వంగారి మాతయ్‌, 2003లో షిరిన్‌ ఇబాది నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్నారు. ఆచరణీయమైన తమ పద్ధతులతో సమాజంలో స్నేహ సౌరభాలు వెదజల్లి శాంతి నెలకొల్పారు.

కాసావో పరిష్కారంతో మార్తి అతిసారికి..

1994 -2000 మధ్య ఫిన్లాండ్‌ పదో అధ్యక్షుడిగా పనిచేసిన మార్తి అతిసారి.. సుదీర్ఘకాలం తిష్టవేసిన కాసావో సమస్యను పరిష్కరించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా చర్చలు జరిపారు. ఆయన కృషి వల్ల 2008లో కాసావో.. సెర్బియా నుంచి శాంతియుతంగా విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. నమీబియా, ఇండోనేసియా, ఇరాన్‌లో ఏళ్లుగా కొనసాగిన సమస్యలను మార్తి అతిసారి పరిష్కరించారు. ఆయన సేవలకు గానూ.. 2008లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు.

విప్లవాత్మక మార్పులతో యూసుఫ్​కు​...

బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్‌ యూసుఫ్‌ సామాజిక వ్యాపారవేత్త. బ్యాంకింగ్‌ రంగం ద్వారా నిరుపేదల బతుకుచిత్రాన్ని ఎంత అద్భుతంగా మార్చవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన మనసున్న మనిషి. గ్రామీణ బ్యాంకు ద్వారా.. సూక్ష్మరుణాలు అందజేసి.. పేదలను చిరు వ్యాపారవేత్తలుగా మార్చారు. సూక్ష్మ రుణాలు అందజేసేందుకు ఆయన అవలంబించిన పద్ధతిని అనేక దేశాలు తమ విధానాలను మార్చుకున్నాయి. బ్యాంకులు సైతం సరికొత్త పద్ధతుల్లో సేవలు అందిస్తున్నాయి.

చిన్నారుల హక్కుల పరిరక్షణతో షిరిన్​కు​..

ఇరాన్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త, మాజీ న్యాయమూర్తి, న్యాయవాది.. షిరిన్‌ ఇబాది. డిఫెండర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ సెంటర్‌ను ఇరాన్‌లో స్థాపించారు. చిన్నారుల హక్కుల కోసం పోరాడారు. చిన్నారులపై అన్ని రకాల హింసను నిరోధించే ఇస్లామిక్‌ కన్సల్టేటివ్‌ అసెంబ్లీ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై 2002లో చర్చ జరిగి, చట్టం రూపొందింది. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషికి గానూ 2003లో నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.

తొలి ఆఫ్రికా మహిళ మాతయ్​..

నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న తొలి ఆఫ్రికా మహిళ... వంగారి మాతయ్‌. సామాజిక, పర్యావరణ కార్యకర్త. రాజకీయ నాయకురాలు. పర్యావరణ పరిరక్షణ, మహిళా హక్కుల సంరక్షణ కోసం ఆమె 1997లో గ్రీన్‌ బెల్ట్‌ మూవ్‌మెంట్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. 2003 నుంచి 2005 వరకు కెన్యా పర్యావరణ, సహజ వనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. వరల్డ్‌ ఫ్యూచర్‌ కౌన్సిల్‌ గౌరవ సభ్యురాలిగా పనిచేశారు.

హక్కుల సాధన కోసం గాంధీజీ తర్వాత అహింసా పద్ధతిని మనసా వాచా కర్మేణా పాటించిన నెల్సన్‌ మండేలా, అంగ్‌ సాన్‌ సూకీ.. తమ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చారు. దశాబ్దాల తమ కలను నెరవేర్చుకుని ఈ పోరాట యోధులు.. నోబెల్‌ శాంతి బహిమతి దక్కించుకున్నారు.

సహనం ఉంటేనే ప్రపంచశాంతి....

గాంధీజీ సిద్ధాంతాలు కాలపరీక్షకు నిలిచాయి. నెల్సన్‌ మండేలా నుంచి మార్తి అతిసారి వరకు వారు అవలంబించిన పద్ధతులే.. ఇందుకు ఉదాహరణ. అసహనంతో రగిలిపోతూ.. తక్షణ పరిష్కారాలు వెతికే ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోవాలి. నిరంతర ఘర్షణల పరిష్కారానికి గాంధేయ విధానంలో పరస్పర విశ్వాసంతో సహనంగా ప్రయత్నిస్తే.. ప్రపంచశాంతి సిద్ధించేందుకు ఎక్కువ సమయం పట్టదు.

(రచయిత- రాజీవ్​ రాజన్​)

Last Updated : Sep 27, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details