తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొలిక్కిరాని చర్చలు- కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో

రైతులతో కేంద్రం చర్చలు కొలిక్కిరాలేదు. దిల్లీ విజ్ఞాన్​ భవన్​లో సుదీర్ఘంగా సమావేశమైనప్పటికీ.. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. డిసెంబర్​ 3న మరోసారి సమావేశం కానున్నారు. అప్పటివరకు రైతు చట్టాలపై తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

By

Published : Dec 1, 2020, 7:55 PM IST

Farmers' protests
రైతులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు ఇప్పట్లో ఆగేలా లేవు. రైతు సమస్యల పరిష్కారం కోసం.. దిల్లీ విజ్ఞాన్​ భవన్​లో రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చ ఓ కొలిక్కిరాలేదు. రైతు యూనియన్ల ప్రతినిధులు, కేంద్ర ప్రతినిధులు సహా వ్యవసాయ రంగ నిపుణులతో ఉమ్మడి కమిటీ చేయాలన్న కేంద్ర ప్రతిపాదనను దాదాపు 35 సంఘాలకు చెందిన రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.

డిసెంబర్​ 3న మరోసారి సమావేశం కానున్నట్లు కేంద్ర ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పీయూష్​ గోయల్​, నరేంద్ర సింగ్​ తోమర్​, సోమ్​ ప్రకాశ్​ హాజరయ్యారు.

రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల సమావేశం

3 వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా డిమాండ్​ చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:కర్షక పోరు: ఈ ఐదు ప్రశ్నలకు బదులేది?

భేటీ అనంతరం మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్​ చర్చలు సానుకూలంగా సాగాయని అన్నారు.

''సమావేశం బాగానే జరిగింది. డిసెంబర్​ 3న మరోసారి చర్చలు జరపనున్నాం. మేమొక కమిటీని నియమించాలనుకున్నాం. కానీ రైతు సంఘాలు అందుకు ఒప్పుకోలేదు. అందరి సమక్షంలోనే చర్చలు జరగాలంటున్నారు. దానితో మాకేం సమస్య లేదు.''

- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ మంత్రి

ఇవాళ జరిగిన సమావేశంలో కాస్త పురోగతి కనిపించిందని అన్నారు అఖిల భారత రైతు సంఘం అధ్యక్షులు ప్రేమ్​ సింగ్​ భాంగు.

''ఇవాళ సమావేశం బాగానే జరిగింది. కాస్త పురోగతి కనిపించింది. డిసెంబర్​ 3న జరగనున్న తదుపరి సమావేశంలో.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒరిగేదేమీ లేదని కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాం. మా నిరసనలు మాత్రం కొనసాగుతాయి.''

- ప్రేమ్​ సింగ్​ భాంగు, అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు

ఆగని నిరసనలు..

మరోవైపు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో దిల్లీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. పంజాబ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి దిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపుర్ సరిహద్దులకు చేరుకున్న రైతులు పోరాటం సాగిస్తున్నారు.

రైతుల ఆందోళన

విద్యార్థులు కూడా వారికి మద్దతుగా ఆందోళన చేస్తున్నారు. నిరసనల నేపథ్యంలో ఆ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. బురాడీలోని నిరంకారీ మైదానంలోనూ రైతులు ధర్నా చేస్తున్నారు.

సింఘూ సరిహద్దు వద్ద రైతుల నిరసనలు

విపక్షాలూ వీరికి మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్రం తీరును తప్పుబడుతున్నాయి. కెనడా ప్రధాని జస్టిన్​ ట్రుడో కూడా రైతుల నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: రైతులకు కెనడా ప్రధాని మద్దతు- భారత్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details