తెలంగాణ

telangana

ఆ బాలిక సంకల్పానికి బ్రిటన్​ విశిష్ట పురస్కారం

By

Published : Oct 31, 2020, 9:16 AM IST

బాల కార్మిక వ్యవస్థలో చిక్కుకున్న చిన్నారే తను. ఆ ఊబి నుంచి బయటపడ్డాక తనలా మరే ఆడపిల్ల మిగిలిపోకూడదని నిశ్చయించుకుంది. బాలికలు ఉండాల్సింది పాఠశాలల్లో గానీ, పనుల్లో కాదని గళమెత్తుతోంది. బాల్యవివాహాలు, చిన్నారులపై దాడులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఝూర్ఖండ్‌కు చెందిన ఆ చిన్నారి సంకల్పాన్ని మెచ్చిన బ్రిటన్​ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక డయానా పురస్కారంతో సత్కరించింది. పిల్లల జీవితంలో ఆనందం నింపడానికి అందరూ తోడ్పడాలని పిలుపునిస్తోందీ బాలిక.

etv bharat special story about a girl who won diana award from britan government
'ప్రేమతో పంపండి నాన్న.. పోరాడేందుకు వెళ్తున్నాను'

'ప్రేమతో పంపండి నాన్న.. పోరాడేందుకు వెళ్తున్నాను'

ఝూర్ఖండ్‌, గిరిడీ జిల్లాలోని చిన్న గ్రామం నుంచి వచ్చిన ఓ చిన్నారి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తన ప్రాంతంలో ఎందరో ఆడపిల్లలను బాలకార్మిక వ్యవస్థ నుంచి కాపాడి బడిబాట పట్టించేందుకు కృషి చేస్తోంది.

ఓ పాట ద్వారా తన తండ్రితో పాటు మరెంతోమంది కన్నవారిని ఆడపిల్లల అభ్యున్నతికి చేయూతనివ్వాలని కోరుతోంది. ఆ ప్రాంత ఆడపిల్లలు ఉండాల్సింది భవిష్యత్‌ను నిర్ణయించుకునే పాఠశాల్లోనే కానీ, పనిలో కాదన్నది తన నిశ్చితాభిప్రాయం. చంపా కృషిని గుర్తించిన బ్రిటన్‌ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక డయానా అవార్డుతో సత్కరించింది.

"కొంతమందినైనా నాతోపాటు పాఠశాలకు తీసుకెళ్లాలన్నది నా ఆలోచన. కష్టంలో ఉన్న వారిని కోసం నేనెందుకు నిలబడకూడదు? వారినెందుకు బడిలో చేర్చకూడదు? బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, చిన్నారులపై దాడులకు వ్యతిరేకంగా నేను గళమెత్తిన తర్వాత స్థానికులు, సామాజిక కార్యకర్తల నుంచి మద్దతు లభించింది. డయానా అవార్డు వచ్చింది. అది నాకు చాలా సంతోషం కలిగించింది."

--చంపా, డయానా అవార్డ్‌ విజేత.

వాళ్ల సాయంతో..

మొదట్లో చంపా కూడా పనికి వెళ్లేది. కైలాశ్‌సత్యార్థి ఫౌండేషన్‌ సహాయంతో ఈ ఊబి నుంచి బయట పడింది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాల నిర్మూలన కోసం కృషి చేస్తోంది.

"చంపా కుమారి జమదాగ్‌ గ్రామం నుంచి వచ్చింది. గతంలో మైకా గనుల్లో బాలకార్మికురాలిగా పని చేసేది. మా కార్యకర్తలను తనను బడికి ఎందుకు వెళ్లడం లేదని అడిగారు. చంపా కుటుంబం కోసం కష్ట పడుతున్నట్లు తెలిపింది. తర్వాత మా వాళ్లు అమెను బడిలో చేర్పించారు."

--ముఖేశ్‌ తివారి, కైలాశ్‌సత్యార్థి ఫౌండేషన్‌.

నిరుత్సాహపరిచిన వారే..

మొదట్లో చంపా తండ్రికి ఆమె చేస్తున్న కార్యక్రమాలు నచ్చేవి కాదు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిరుత్సాహ పరిచేవాడు. కానీ, డయానా అవార్డును అందుకున్న తర్వాత చంపా తం‌డ్రి వైఖరిలో మార్పు వచ్చింది. ఆయనే కాదు.. మొదట్లో తనను నిరుత్సాహపరిచిన వారంతా ఇప్పుడు చంపా కృషికి సాయం చేయమని ఇతరులకు కూడా సూచిస్తున్నారు.

"మొదట్లో గ్రామస్థులు గొడవ చేసేవారు. మీ అమ్మాయి అలాంటి పనులకు దూరంగా ఉంచమని, వాటివల్ల ఎలాంటి లాభం లేదనే వారు. ఇప్పుడు ఎవరూ ఏమీ అనడం లేదు. అవార్డు తర్వాత అంతా సంతోషంగా ఉన్నారు."

--మహేంద్ర ఠాకూర్‌, చంపా తండ్రి.

బాలకార్మికులను సరైన దారిలోకి తీసుకుని రావటమే కాదు.. తన పరిసరాల్లో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు చంపా కృషి చేస్తోంది. పేదరికం తన పోరాటాలకు ఎక్కడా అడ్డు కాలేదు. పిల్లల జీవితాల్లో ఆనందం నింపడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని చంపా చెబుతోంది.

ఇదీ చూడండి:ఈ 'గ్రీన్​మ్యాన్'కు ప్రకృతి అంటే ఎంత ప్రేమో!

ABOUT THE AUTHOR

...view details