దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోపాలిటన్ రీజియన్లోని గ్రిడ్ దెబ్బతినడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ముంబయి తూర్పు, పడమర, ఠానె, పాల్ఘడ్, రాయ్గఢ్ సహా పలు ప్రాంతాలు కొన్ని గంటలుగా అంధకారంలోనే ఉన్నాయి. సేవల్లో అంతరాయం పట్ల చింతిస్తున్నట్లు బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) వినియోగదారులకు ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లోని లోకల్, మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సిగ్నళ్లు ఆగిపోయాయి. ఫలితంగా రోడ్లపై రద్దీ ఏర్పడింది.
విద్యుత్ వైఫల్యంతో ఆస్పత్రులపై ఎలాంటి ప్రభావం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సబర్బన్ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 400 కేవీ లైన్ ట్రిప్ అయినట్లు సమాచారం. అయితే ఆ ఎలక్ట్రిక్ లైన్ను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. ఎంఐడీసీ, పాల్ఘర్ లైన్లో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముంబయి నగరానికి వెళ్తున్న 360 మెగా వాట్ల పవర్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ఎక్సేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మాత్రం ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి.
గంటలో పునరుద్ధరిస్తాం...
మరో గంటలో ముంబయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు విద్యుత్ లైన్లను వేరే గ్రిడ్తో అనుసంధానిస్తున్నట్లు పేర్కొన్నారు.