తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్​ ఎఫెక్ట్​': సందిగ్ధంలో కాంగ్రెస్ భవితవ్యం

అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ నూతన రథసారథి ఎవరన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. పార్టీ ముఖ్యనేతలు గురువారం పార్లమెంట్ వేదికగా సమావేశమైనప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చేవారం కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం అనంతరం పార్టీ కొత్త అధ్యక్షుని ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By

Published : Jul 5, 2019, 4:58 AM IST

Updated : Jul 5, 2019, 8:10 AM IST

సందిగ్ధంలో కాంగ్రెస్ భవితవ్యం

సందిగ్ధంలో కాంగ్రెస్ భవితవ్యం

పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి, వెనక్కి తగ్గేది లేదని రాహుల్ గాంధీ భీష్మించుకు కూర్చున్నందున కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొంది. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని పార్టీ సీనియర్లు ఒత్తిడి చేస్తున్నందువల్ల అధ్యక్ష పదవిపై సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన అనంతరం ఓ ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసు అంశమై గురువారం ముంబయి కోర్టులో హాజరయ్యారు రాహుల్.

సీనియర్ల భేటీ...

రాహుల్ రాజీనామా నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ కాంప్లెక్స్​ భవనంలోని పార్టీ లోక్​సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కార్యాలయంలో మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ భేటీ అయ్యారు. కానీ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

రాహుల్ రాజీనామాపై సీడబ్ల్యూసీ సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ భేటీ వచ్చేవారం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సీడబ్ల్యూసీ ముందు అనేక ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ తాత్కాలికంగా ఎవరినైనా ఎంపిక చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్, ముకుల్ వాస్నిక్​లలో ఒకరికి అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఉండాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ కోరుతున్నారు.

విశ్లేషకుల భిన్న స్వరాలు

గాంధీ కుటుంబం లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీ మనుగడ లేదని రాజకీయ విశ్లేషకురాలు, దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సుశీల రామస్వామి అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబమే.. ఇతర నేతలతో కలిసి పార్టీని నడిపించాల్సిన అవసరం ఉందన్నారు.

రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ నిర్వాహకులు సంజయ్ కుమార్. పార్టీ అధ్యక్షులు గాంధీ కుటుంబం వారు కాకుంటే.. కాంగ్రెస్​ సంక్షోభంలో చిక్కుకొంటుందని అభిప్రాయపడ్డారు.

Last Updated : Jul 5, 2019, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details