లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని తప్పనిసరి సెలవులపై పంపింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎస్ బ్యాంక్ కేసులో నిందితులుగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాద్వాన్లకు ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు అనుమతిచ్చినందుకు ఈ చర్యలకు ఉపక్రమించినట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ స్పష్టం చేశారు.
"ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించిన తర్వాతే సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ గుప్తాను తప్పనిసరి సెలవుపై పంపించాం. తక్షణమే ఇది అమలులోకి వస్తుంది. ఆయనపై విచారణ పెండింగ్లో ఉంది." -అనిల్ దేశ్ముఖ్, మహారాష్ట్ర హోం మంత్రి
లాక్డౌన్ ఉన్నా ఫామ్హౌస్కు..
అమితాబ్ గుప్తా అనుమతితో కపిల్, ధీరజ్ వాద్వాన్ సతారా జిల్లా మహాబలేశ్వర్లోని వారి ఫామ్హౌజ్కు చేరుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడ మొత్తం 23 మంది ఉన్నట్లు వెల్లడించారు. వారిలో కొంత మంది ఖండాల నుంచి పుణె, సతారా జిల్లాలను దాటుకుని ప్రయాణాలకు అనుమతిలేకున్నా అక్కడకు వచ్చినట్లు వివరించారు. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద వారందరిపై సతారా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రస్తుతం నిర్బంధంలో ఉంచినట్లు స్పష్టం చేశారు.
దేవేంద్ర ఫడణవీస్ విమర్శలు..
లాక్డౌన్ ఉల్లంఘనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "మహారాష్ట్రలో ధనవంతులకు లాక్డౌన్ వర్తించదా? ఇలాంటి సమయాల్లో అధికారులు ప్రయాణాలకు ఎలా అనుమతించారు" అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:భవితను మనమే నిర్మించుకుందాం!