పదవీ విరమణ సమయంలో సాధారణంగా అధికారులు భావోద్వేగానికి లోనవుతారు. కొంతమంది వీడ్కోలు వేడుకలు జరుపుకుని.. ఉద్వేగంగా ప్రసంగిస్తారు. అయితే కేరళకు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ జాకోబ్ థామస్ మాత్రం.. తన పదవీ విరమణ రోజు కార్యాలయంలోనే నిద్రపోయారు. దుప్పటి, దిండు ఉన్న ఓ ఫొటోను ఆయనే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఎన్నో విభేదాలు...
1985 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన థామస్.. 35 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నారు. అయితే ప్రభుత్వంతో ఆయనకు ఎన్నో విభేదాలు ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రెండేళ్ల పాటు సస్పెన్షన్ను కూడా ఎదుర్కొన్నారు. గత ఏడాది డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.
అయితే తన తదుపరి కార్యచరణపై ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు థామస్. విద్యా పరిశోధన కార్యకలాపాలతో పాటు రాజకీయ విశ్లేషకుడిగా పనిచేసేందుకు థామస్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
థామస్ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో చాలకుడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి.