తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 6:04 PM IST

ETV Bharat / bharat

రైతుల 'ఛలో దిల్లీ' ఆందోళనలు ఉద్రిక్తం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై.. రైతన్న ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఆ చట్టాలను నిరసిస్తూ.. పంజాబ్​, హరియాణా నుంచి రైతులు దిల్లీకి పయనమయ్యారు. అయితే.. సరిహద్దుల్లో హరియాణా, దిల్లీ పోలీసుల అడ్డగింతతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా.. అక్కడి యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

Delhi Chalo march: Punjab farmers face water cannons, push through Haryana barricades
రైతుల 'ఛలో దిల్లీ' ఆందోళనలు ఉద్రిక్తం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​, హరియాణా రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' ఆందోళన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. దిల్లీ సరిహద్దు ప్రాంతాలు రణ రంగాన్ని తలపిస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి రైతులు దేశ రాజధానిలో ప్రవేశించకుండా.. పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.

బ్యారికేడ్లను తొలగిస్తున్న రైతులు
ర్యాలీగా బయల్దేరిన పంజాబ్​ రైతులు

'ఛలో దిల్లీ' పిలుపు మేరకు.. దేశ రాజధానికి బయలుదేరిన రైతులను హరియాణా అంబాలాలోని సాదోపుర్​ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిపై బాష్పవాయుగోళాలను ప్రయోగించారు.

రైతులను చెదరగొడుతున్న పోలీసులు

పంజాబ్​ నుంచి భారీగా..

పంజాబ్ నుంచి కూడా రైతులు పెద్దసంఖ్యలో దిల్లీకి పయనమయ్యారు. వేలాది వాహనాల్లో రైతులంతా హస్తిన బాటపట్టారు. హరియాణాలోనికి ప్రవేశించకుండా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంభు సరిహద్దు వద్ద రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను వంతెన పైనుంచి కిందకు విసిరారు ఆందోళనకారులు.

సరిహద్దుల వద్ద పోలీసుల బందోబస్తు
బారికేడ్లను తొలగిస్తున్న ఆందోళనకారులు
రైతులపై జలఫిరంగుల ప్రయోగం

రైతులను చెదరగొట్టేందుకు జలఫిరంగులు ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చూడండి:ఉద్ధృతంగా రైతుల ఆందోళనలు

తమను ఆపిన చోటే ధర్నాకు దిగుతామని.. రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. భారీ సంఖ్యలో ప్రజల్ని మోహరిస్తామని హెచ్చరించాయి.

పోలీసుల నిఘా

26,27 తేదీల్లో దిల్లీలో నిరసనకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో.. హరియాణా, దిల్లీ సరిహద్దులో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వాహనదారులను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్​ స్తంభించింది.

స్తంభించిన ట్రాఫిక్​

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. రైతులకు మద్దతుగా నిలిచారు. 'రైతులపై క్రూరత్వంగా ప్రవర్తించినందుకు.. మోదీ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్లంతా దృఢనిశ్చయంతో ఉన్నారు' అని ట్వీట్​ చేశారు.

సీఎంల మాటల యుద్ధం

శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తూ దిల్లీకి వెళ్తున్న రైతులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. హరియాణా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​.

'మీరే తప్పుదోవ పట్టిస్తున్నారు.'

పంజాబ్​ సీఎంపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ విమర్శలు గుప్పించారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఏదైనా సమస్య ఎదురైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అమరీందర్​తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. స్పందించడం లేదని ట్వీట్​ చేశారు.

ఖట్టర్​ ట్వీట్​

దీటు జవాబు..

ఖట్టర్​ వ్యాఖ్యలపై అమరీందర్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరపై నమ్మకం కలిగించాల్సింది తనకు కాదని.. రైతులకు అని బదులిచ్చారు.

అమరీందర్​ సింగ్​ ట్వీట్​

''ఖట్టర్​ జీ.. మీ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయా. కనీస మద్దతు ధరపై నమ్మకం కలిగించాల్సింది నాకు కాదు.. రైతులకు. దిల్లీకి వెళ్లేముందు మీరే ఒకసారి రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. నేనే ఒకవేళ రైతులను ప్రేరేపించి తప్పుదోవ పట్టిస్తే మరి హరియాణా రైతులు కూడా దిల్లీకి ఎందుకు ప్రదర్శన చేపట్టారు?''

- అమరీందర్​ సింగ్​, పంజాబ్​ ముఖ్యమంత్రి.

విప్లవాత్మక మార్పులు..

కొత్త వ్యవసాయ చట్టాలు అత్యవసరమని అన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. ఇవి దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని పునరుద్ఘాటించారు. ఆందోళనలు విరమించుకోవాలని రైతులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details