దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 88 కేసులు నమోదుకాగా కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 694కు చేరుకుంది.
కరోనా బారిన నిన్న మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఫలితంగా దేశంలో మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది. మరో 44 మంది కోలుకున్నారని.. ఒకరు దేశం విడిచివెళ్లటం వల్ల ప్రస్తుతం కరోనా ఆక్టివ్ కేసుల సంఖ్య 633గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
స్థిరంగానే వ్యాప్తి రేటు..
భారత్లో ఒక్కరోజే 88 కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి. అయితే దేశంలో అంతర్గతంగా వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు సరైన ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను గమనిస్తే వృద్ధి రేటు స్థిరంగానే ఉన్నట్లు తెలిపింది.
"దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల స్థిరంగానే ఉంది లేదా వృద్ధి రేటులో కొంచెం తగ్గింపు కనిపిస్తోంది. ప్రస్తుత లెక్కల ఆధారంగా దేశంలో పరిస్థితిని అంచనా వేయలేం."
-లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో కరోనా బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రులను ప్రారంభించినట్లు అగర్వాల్ వెల్లడించారు. దోమల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. లాక్డౌన్కు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లతో మాట్లాడినట్లు తెలిపారు. దిల్లీ ఎయిమ్స్తో కలిసి వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామన్నారు.