తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభం'

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందుకు భిన్నంగా కొంతమంది ఆరోగ్య నిపుణుల బృందం ప్రధాని నరేంద్రమోదీకి ఓ నివేదిక పంపిది. జనసాంద్రత, అధిక జనాభా గల ప్రాంతాల్లో ఇప్పటికే సామాజిక వ్యాప్తి జరుగుతోందని స్పష్టం చేసింది.

By

Published : Jun 1, 2020, 7:47 PM IST

Community transmission
సామాజిక వ్యాప్తి

దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జనసాంద్రత లేదా అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందని ఎయిమ్స్​ వైద్యులతో పాటు ఐసీఎంఆర్​లోని ఇద్దరు​ పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు భారత ప్రజారోగ్య సంఘం(ఐపీహెచ్​ఏ), ఇండియన్​ అసోసియేషన్​ ఆఫ్ ప్రివెంటివ్​ అండ్ సోషల్​ మెడిసిన్​ (ఐఏపీఎస్​ఎం), భారత అంటువ్యాధి వైద్యుల సంఘం (ఐఏఈ) సంయుక్తంగా ప్రధాని నరేంద్రమోదీకి నివేదిక అందించాయి.

"దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టగలమని విశ్వాసంతో ఉన్నారు. కానీ ఇది అసంభవం. జనసాంద్రత, జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే సామాజిక వ్యాప్తి జరుగుతోంది. వైరస్​ వ్యాప్తి వేగాన్ని నియంత్రించటం, ప్రజారోగ్య వ్యవస్థపై భారాన్ని తగ్గించటం కోసం లాక్​డౌన్​ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ, జనజీవనానికి ఇబ్బందులు ఎదురైనా కొంతమేర విజయం సాధించాం."

- నిపుణుల నివేదిక

నిపుణుల సలహా తీసుకుంటే..

దేశంలో మార్చి 25 నుంచి మే 31 వరకు కఠినమైన లాక్​డౌన్​ అమలు చేశారు. అయితే ఈ దశలో జరిగిన కొన్ని లోపాల కారణంగా కేసుల సంఖ్య భారీగానే పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. మార్చిలో 606గా ఉన్న కరోనా కేసులు మే 24 నాటికి 1.3 లక్షలకు చేరుకున్నాయని గుర్తుచేశారు.

"లాక్​డౌన్​కు సంబంధించి అంటువ్యాధుల నిపుణులను సంప్రదించలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు, కొంతమంది వైద్యులు సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ప్రభుత్వం సాధారణంగా అధికారులపైననే ఆధారపడుతుంది. వ్యాధి సంక్రమణపై పూర్తి అవగాహన ఉన్న నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుని ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవి. ప్రస్తుతం ప్రజల ప్రాణాలు, వ్యాధి వ్యాప్తితో దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది."

- నిపుణుల నివేదిక

దేశంలో ఇప్పటివరకు 1,90,535 కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,394 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేసుల సంఖ్యలో భారత్​ ఏడో స్థానంలో ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

ఇదీ చూడండి:'వ్యాక్సిన్​ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు'

ABOUT THE AUTHOR

...view details