తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సోమవారం నుంచి పరుగులు పెట్టనున్న క్లోన్​ ట్రైన్స్​'

రైల్వే ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్​ మేరకు 40 ప్రత్యేక క్లోన్​ ట్రైన్స్​ను సోమవారం నుంచి నడపనుంది రైల్వే శాఖ. రద్దీ ప్రాంతాలలో నడిచే ఈ రైళ్ల అడ్వాన్స్​ బుకింగ్స్​ సెప్టెంబర్​ 19 నుంచే ప్రారంభమయ్యాయి. పేరెంట్​ రైళ్లతో పోలిస్తే.. ఈ క్లోన్​ ట్రైన్స్​ దాదాపు 3 గంటల ముందుగానే గమ్యం చేరనున్నాయని, అత్యవసర ప్రయాణాలు చేపట్టే వారికి వరంగా మారనున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

By

Published : Sep 20, 2020, 7:15 PM IST

Updated : Sep 20, 2020, 9:42 PM IST

Clone trains
ఈనెల 21 నుంచి పట్టాలపైకి 40 'క్లోన్​ ట్రైన్స్​'

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత దశల వారీగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది రైల్వే శాఖ. పెరుగుతున్న డిమాండ్​ మేరకు.. రద్దీ రూట్లలో 40 క్లోన్​ టైన్స్​ నడుపుతోంది. ఈనెల 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సాధారణ రైళ్లతో పోలిస్తే.. దాదాపు 3 గంటల ముందుగానే గమ్యస్థానాన్ని చేరుకుంటాయని రైల్వేశాఖ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

"క్లోన్​ ట్రైన్స్​లో పూర్తిగా 3-ఏసీ కోచ్​లు ఉంటాయి. చాలా తక్కువ స్టేషన్లలో ఆగడం, అత్యంత వేగంగా వెళ్లటం వల్ల గమ్యాన్ని పేరెంట్​ ట్రైన్​ కన్నా దాదాపు 3 గంటల ముందే చేరుకుంటుంది. ఈ రైళ్లు అత్యవసర పరిస్థితుల్లో లేదా చివరి నిమిషంలో ప్రణాళిక చేసుకున్న ప్రయాణికులకు వరంగా మారనున్నాయి. ప్రయాణాలు చేయాలనుకున్న వారందరినీ గమ్యస్థానాలకు చేరుస్తాం. ఈ 20 జతల రైళ్లు ప్రధానంగా బిహార్​, బంగాల్​, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటకల మధ్య నడవనున్నాయి. 2016లోనే ఈ రైళ్లకు బీజం పడినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కరోనాతో వీటికి మార్గం సుగమమైంది."

-సీనియర్ అధికారి, రైల్వే శాఖ.

బుకింగ్స్​ ప్రారంభం..

20 జతల క్లోన్​ ట్రైన్స్​లో 19 రైళ్లకు (18 కోచ్​లు) హమ్​సఫర్​ ఎక్స్​ప్రెస్​ ఛార్జీలు, మరో ట్రైన్​ (22కోచ్​లు, లఖ్​నవూ- దిల్లీ)కు జన్​శతాబ్ది టికెట్​ రేట్లు వసూలు చేయనున్నారు. అడ్వాన్స్​ రిజర్వేషన్​ సమయాన్ని 10 రోజులుగా నిర్ణయించారు. బుకింగ్స్​ సెప్టెంబర్​ 19 ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి.

రైళ్ల వివరాలు..

  • తూర్పు మధ్య రైల్వే ఆధ్వర్యంలో 10 రైళ్లు (5 జతలు).. బిహార్​-దిల్లీ మధ్య నడుస్తాయి. ఈ మార్గంలో బిహార్​లోని సహార్సా, రాజేంద్రనగర్​, రాజ్​గిర్​, దర్భాంగా, ముజఫర్​పుర్​లలో ఆగనున్నాయి.
  • ఈశాన్య రైల్వే ఆధ్వర్యంలో రెండు రైళ్లు.. బిహార్​ కటిహార్​ నుంచి దిల్లీకి నడవనున్నాయి.
  • ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో 10 రైళ్లు(5 జతలు).. దిల్లీ-బిహార్​, బంగాల్​-దిల్లీ, పంజాబ్​-బంగాల్​, ఉత్తరప్రదేశ్​-దిల్లీల మధ్య పరుగులు పెట్టనున్నాయి.
  • దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రెండు రైళ్లు... దనాపుర్​(బిహార్​) నుంచి సికింద్రాబాద్​ మధ్య నడవనున్నాయి.
  • దక్షిణ పశ్చిమ రైల్వే ఆధ్వర్యంలో 6 రైళ్లు(3 జతలు).. గోవా-దిల్లీ, కర్ణాటక-బిహార్​, కర్ణాటక-దిల్లీ మధ్య పరుగులు పెట్టనున్నాయి.
  • పశ్చిమ రైల్వే ఆధ్వర్యంలో 10 రైళ్లు(5 జతలు).. బిహార్​(దర్భాంగ)- గుజరాత్​(అహ్మదాబాద్​), దిల్లీ-గుజరాత్​, బిహార్​(ఛాప్రా)- గుజరాత్​(సూరత్​), ముంబయి-పంజాబ్​, గుజరాత్​(అహ్మదాబాద్​)- బిహార్​(పట్నా)ల మధ్య నడపనుంది.

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్ కారణంగా మార్చి 25 నుంచి అన్ని రకాల ప్రయాణ రైళ్లను నిలిపివేసింది భారతీయ రైల్వే శాఖ. ఆ తర్వాత దశల వారీగా కొన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వలస కార్మికల కోసం శ్రామిక్​ రైళ్లును మే 1 నుంచి నడుపుతోంది. తర్వాత 230 ప్రత్యేక రైళ్లను దేశవ్యాప్తంగా నడుపుతోంది. సెప్టెంబర్​ 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది.

ఇదీ చూడండి: పీజీ మెడికోలకు 3 నెలలు జిల్లా ఆస్పత్రుల్లోనే శిక్షణ

Last Updated : Sep 20, 2020, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details