పర్యావరణానికి మేలు చేసేలా శుద్ధ ఇంధన ఉత్పాదనకు విశేష ప్రాధాన్యమిచ్చి 2030 నాటికి చమురు దిగుమతుల్ని 10 శాతం మేర తెగ్గోయాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వానికి తీపికబురిది. దేశంలోని ప్రధాన జలాశయాల ఉపరితలాలను సద్వినియోగపరచుకోగలిగితే ఎకాయెకి 280 గిగావాట్ల (ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లు) సౌర విద్యుదుత్పత్తికి వీలుందని నూతన అధ్యయనాంశాలు వెల్లడిస్తున్నాయి. ఈటీసీ (ఎనర్జీ ట్రాన్స్మిషన్ కమిషన్)లో అంతర్భాగమైన ఇంధన వనరుల సంస్థ అంచనా ప్రకారం- భారత్లో 18వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జలాశయాల ఉపరితలాలు... అక్షరాలా, సౌర ఇంధన గనులు. తొలుత 2022 నాటికి 100 గిగావాట్ల సౌర సామర్థ్యం సంతరించుకోవాలని లక్షించిన ఇండియా, అప్పటికి 175 గిగావాట్ల ఉత్పత్తిని సాధించే దిశగా పురోగమిస్తున్నదని తొమ్మిది నెలలక్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ కితాబిచ్చింది. సరికొత్త మదింపు ప్రాతిపదికన నీటిపై సౌర విద్యుదుత్పాదన చురుగ్గా సాకారమైతే, మరిన్ని అద్భుతాలు తథ్యమన్న ఆశలిప్పుడు మోసులెత్తుతున్నాయి!
సౌరవిద్యుత్ ప్రాజెక్ట్
శిలాజ ఇంధనాల వినియోగం పెచ్చరిల్లడంవల్ల పర్యావరణ విధ్వంస పర్యవసానాల తీవ్రతను ఆకళించుకున్న పలు దేశాల్లో కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయాల వేట సాగుతోంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో దశాబ్దం క్రితం క్యాలిఫోర్నియాలో నీటిపై తేలియాడే (ఫ్లోటో ఓల్టాయిక్) సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటైంది. క్రమేణా ఆ ఒరవడి ఇతర దేశాలకూ విస్తరించింది. అమెరికావ్యాప్తంగా మొత్తం విద్యుత్ సరఫరా రాశిలో జలాశయాలపై ఉత్పత్తవుతున్నది 10 శాతమని ప్రపంచబ్యాంకు మొన్నీమధ్య లెక్కకట్టింది. ప్రపంచం నలుమూలలా ఆ ఉత్పత్తి పోనుపోను 400 గిగావాట్లకు చేరనుందన్న అంచనాలు లోగడే వెలుగుచూశాయి. అందులో సగానికిపైగా భారత్లోని జలాశయాలపైనే అందిరానుందన్న అధ్యయనాంశాలు- ఎన్నో అవకాశాల ద్వారాల్ని తెరవగలిగేంత ప్రభావాన్వితమైనవి!
కేంద్రం ఖరారు
నివాసాలపై సౌర విద్యుదుత్పత్తిలో గ్రేటర్ హైదరాబాద్ చురుగ్గా ఉందన్న కథనాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపట్ల ఇనుమడించిన జన చేతనకు అద్దంపడుతున్నాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీల్లో సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు ధరలు, రాయితీలను కేంద్రం ఇటీవలే ఖరారు చేసింది. విశ్వవిద్యాలయాలు, సర్కారీ ఆస్పత్రులు, రైల్వేల్లో సౌర విద్యుత్ విజయ గాథలు తరచూ వింటున్నాం. సుమారు అయిదేళ్ల క్రితం గుజరాత్లోని వడోదరాలో ఒక నీటి కాల్వపై 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం ఎందరినో విస్మయపరచింది. సాధారణంగా భూమ్మీద అటువంటి ప్రాజెక్టు కోసం దాదాపు 50వేల ఎకరాల దాకా సేకరించాల్సి ఉంటుంది. కాల్వపై నిర్మాణంవల్ల స్థల సేకరణ సమస్యను అధిగమించడం ఒక్కటే కాదు, ఎండ వేడిమికి నీరు ఆవిరయ్యే వేగాన్నీ గణనీయంగా నియంత్రించడం కీలకాంశం. జర్మనీ వంటిచోట్ల జలాశయాలపై అటువంటి ప్రాజెక్టుల వ్యయం 10-15 శాతం అధికమైనట్లు తేలినా, దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా అదేమంత సమస్య కాదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.
అవసరమైన జాగ్రత్తలు