తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరాఠా ఎన్నికలపై భాజపా కసరత్తు షురూ

ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలపై భాజపా కసరత్తు ప్రారంభించింది. 288 స్థానాలు గల శాసనసభలో 220 సీట్లకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఎన్నికల్లోనూ విజయం తమదేనని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Jul 22, 2019, 7:15 AM IST

మరాఠా ఎన్నికలపై భాజపా కసరత్తు షురూ

2019 చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భాజపా కూటమి సన్నహాలు ప్రారంభించింది. 288 స్థానాలున్న శాసనసభలో 220 పైన సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఎన్నికల వ్యూహంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో ముంబయి వేదికగా భాజపా నేతలు సమావేశమయ్యారు. తాను రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు ఫడణవీస్​. శివసేన పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఫడణవీస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"నూతన ముఖ్యమంత్రిని ప్రజలే నిర్ణయిస్తారు. మనం చేసిన అభివృద్ధే మాట్లాడుతుంది. నేను ఇంతకుముందే శాసనసభలో తిరిగి ఎన్నికవుతానని ప్రకటించాను."

-దేవేంద్ర ఫడణవీస్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు కొనసాగుతాయని, త్వరలో సీట్ల అంశమై కూటమి పార్టీలతో చర్చిస్తామని తెలిపారు ఫడణవీస్.

అబ్​కీ బార్...నినాదంతో

సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్​ ఎన్నికల నినాదాన్ని విడుదల చేశారు. 'అబ్​కీ బార్...220 పార్' అని నినదించి 220 సీట్లు గెలవడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. కుంభకోణాలతో కూడిన కాంగ్రెస్ వల్ల దేశానికి తీవ్ర నష్టమని ఆరోపించారు మునుగంటివార్. ఇటీవల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గంలో ఒక అధ్యక్షుడు, ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించడం వారి డొల్లతనానికి నిదర్శనమన్నారు.

288 నియోజకవర్గాల్లో మిత్ర పక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించినప్పటికీ బూత్​ స్థాయి పోల్ మేనేజిమెంట్ ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ఆకాంక్షించారు రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్.

2014 ఎన్నికల్లో భాజపా 128 స్థానాలు గెలిచింది. శివసేన 63 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. భాజపా ఎక్కువ స్థానాలు గెలిచిన కారణంగా ఇరు పార్టీల సంబంధాలపై అనుమానాలు తలెత్తాయి.

ఈ సమావేశానికి కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రమంత్రి పంకజా ముండే గైర్హాజరయ్యారు.

శివసేన స్పందన

భాజపా ఎన్నికల సమావేశంపై స్పందించారు శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్​. రెండు పార్టీల మధ్య ముఖ్యమంత్రి పదవి అంశమై వివాదమేమి లేదని స్పష్టం చేశారు. కానీ సమానంగా అధికార పంపిణీ అంటే సీఎం పదవినీ పంచుకోవాలని సేన వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఇమ్రాన్​పై 'పెద్దన్న' చిన్నచూపు.. నెటిజన్ల ట్రోల్స్​

ABOUT THE AUTHOR

...view details