తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 9:16 AM IST

Updated : Dec 18, 2019, 9:37 AM IST

ETV Bharat / bharat

యోగికి వ్యతిరేకంగా స్వపక్ష సభ్యుల ధర్నా- విపక్షాల మద్దతు

రాష్ట్ర శాసనసభలో సహజంగా విపక్షాలు వివిధ అంశాలపై ప్రభుత్వానిక వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఘటనలు ఉన్నాయి. స్పీకర్​ పోడియం ముందు ధర్నాలు చేపట్టిన సందర్భాలూ ఉన్నాయి. కానీ.. అధికార పక్ష ఎమ్మెల్యే లేవనెత్తిన అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వపక్షమే ధర్నా చేపట్టిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీలో జరిగింది. దానికి విపక్షాలూ మద్దతు పలికాయి. అధికార, విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చిన అంశం గురించి తెలుసుకుందాం.

UP Assembly
యోగి సర్కార్​పై స్వపక్ష నేతల వ్యతిరేకత

రాజకీయ పార్టీల నిబంధనల రేఖను చెరిపేస్తూ.. అధికార, విపక్ష పార్టీలు ఏకతాటిపై నిలిచిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర శాసనసభలో మంగళవారం చోటు చేసుకుంది. భాజపా ఎమ్మెల్యే నందకిషోర్​ గుర్జార్​.. అవినీతి అధికారులపై చర్యల అంశాన్ని లేవనెత్తగా స్పీకర్​ నిరాకరించటాన్ని నిరసిస్తూ.. ధర్నాకు దిగారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. వీరికి మద్దతుగా విపక్షాలూ ధర్నాలో పాల్గొన్నాయి. స్వపక్ష, విపక్ష పార్టీల నిరసనలతో సభ మరుసటి రోజుకు వాయిదా పడింది.

160 మందికిపైగా..

గాజియాబాద్​ ఎమ్మెల్యే గుర్జార్​ సన్నిహితులు కొందరు ఇటీవలే అధికారులతో గొడవపడి అరెస్టయ్యారు. అనంతరం సంబంధిత అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు గుర్జార్​. ఇదే విషయాన్ని సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు. చర్చ చేపట్టాలని కోరారు. కానీ.. స్పీకర్​ అందుకు అంగీకరించకపోవడం వల్ల సభలో వాతావరణం వేడెక్కింది. సుమారు 160 మందికిపైగా అధికార పక్ష ఎమ్మెల్యేలు గుర్జార్​కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

విపక్షాల మద్దతు..

గుర్జార్​కు మద్దతు తెలిపారు విపక్ష సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యేలు. ధర్నాలో పాల్గొన్నారు. సభలో మాట్లాడే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉందని నినాదాలు చేశారు. అయినా స్పీకర్​ మాట్లాడేందుకు అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది.

సభ పునఃప్రారంభమైనప్పటికీ సజావుగా సాగలేదు. సభ్యుల ఐక్యత వర్థిల్లాలని, రోజంతా సభను వాయిదా వేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభను ఒకరోజుపాటు వాయిదా వేశారు. ఈ విధంగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల శాసనసభ వాయిదా పడటం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

యోగి రాజీనామా చేయాలి..

ఒక ఎమ్మెల్యే లేవనెత్తిన సమస్యపై చర్చ జరగకపోవటం వంటిది ఉత్తర్​ప్రదేశ్​ చరిత్రలోనే జరగలేదని విమర్శించారు సమాజ్​వాదీ పార్టీ నేత రామ్​గోవింద్​. అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నేడు మరోమారు ధర్నా చేపడతామని వెల్లడించారు. 1979లో ఇలాంటి అంశమే తెరపైకి వస్తే అధికారులపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు గోవింద్​. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 169 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని.. యోగి ఆదిత్యనాథ్​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

గుర్జార్​ను సముదాయించేందుకు ప్రయత్నాలు..

సభలో నిరసనలు చేపట్టిన ఎమ్మెల్యే గుర్జార్​ను సముదాయించేందుకు భాజపా అగ్రనేతలు ప్రయత్నాలు చేపట్టారు. ఎమ్మెల్యేలతో స్పీకర్​ భేటీ అయ్యి.. సభ్యుల హక్కులకు భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కానీ.. హామీని నెరవేర్చకుంటే మరోమారు ధర్నా చేపడతామని హెచ్చరించాయి విపక్షాలు.

వార్తల్లో గుర్జార్​...

గుర్జార్​ ఇటీవలి కాలంలో అనేక మార్లు వార్తల్లో నిలిచారు. ఆయన కుమారుడు(మైనర్​) ఓ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఎన్నికల అధికారులతోనూ గుర్జార్​ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఓ ఆహారశాఖ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గుర్జార్​కు నోటీసులు జారీ చేశారు. తనను హత్య చేయడానికి పార్టీలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు గుర్జార్​.

ఇదీ చూడండి: ఆర్టికల్​ 370 రద్దు దెబ్బ.. కశ్మీరానికి భారీ నష్టం!​

Last Updated : Dec 18, 2019, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details