తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై రణం: 5 రాష్ట్రాల్లో 960 ఐసోలేషన్​ బోగీలు

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశ రాజధాని దిల్లీలో 503 ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. మొత్తం 5 రాష్ట్రాలకు 960​ బోగీలను కేటాయించింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అన్ని వైద్య సదుపాయాలతో దిల్లీలో ఐసోలేషన్​ బోగీలను ఏర్పాటు చేస్తామని ఆదివారమే ప్రకటించారు కేంద్ర హోమంత్రి అమిత్​ షా.

By

Published : Jun 17, 2020, 4:27 PM IST

503 isolation coaches in Delhi, total 960 in 5 states
కరోనాపై పోరు- దిల్లీకి 503 ఐసోలేషన్ భోగీలు

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దిల్లీ సహా మొత్తం 5 రాష్ట్రాల్లో 960 ఐసోలేషన్​ బోగీలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఇందులో సింహభాగం వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశ రాజధానికి కేటాయించింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్​లో 267 ఐసోలేషన్​ బోగీలతో కలిపి మొత్తం 503 బోగీలను దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచింది.

కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో దిల్లీలో ఆదివారం నాడు అత్యవసర సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. 500 ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ మేరకే ఇప్పుడు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది.

ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్​లో 267, శాకుర్ బస్తీ, సారాయ్ రోహిల్లాలో 50 చొప్పున, దిల్లీ కంటోన్మెంట్​లో 33, ఆదర్శ్​ నగర్​లో 30, సఫ్దార్​గంజ్​లో 21, తుగ్లాకాబాద్​, షాదారలలో 13 చొప్పున, పటేల్ నగర్​ స్టేషన్​లో 26 ఐసోలేషన్​ బోగీలను ఏర్పాటు చేశారు.

5 రాష్ట్రాలకు 960

దిల్లీకి 503 కేటాయించగా, ఉత్తర్​ప్రదేశ్​లో 372 ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేసింది కేంద్రం. తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్​లో 20, మధ్యప్రదేశ్​లో 5 బోగీలను అన్ని వైద్య సదుపాయాలతో అందుబాటులో ఉంచింది. తెలంగాణలో సికింద్రాబాద్​, కాచిగూడ, ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్లలో 20 బోగీల చొప్పున ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో 20 బోగీలు, మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో 5 బోగీలు ఉంచారు.

243 ఐసోలేషన్ బోగీలు కావాలని డిమాండ్ చేసిన యూపీకి.. అడిగిన దానికంటే ఎక్కువగా 372 కేటాయించింది కేంద్రం.

కరోనా లక్షణాలున్న వారికి ఈ ఐసోలేషన్​ బోగీలలో చికిత్స అందిస్తారు. దీని కోసం ఒక్కో బోగీలో రూ.2లక్షలతో వైద్య సదుపాయాలను కల్పించింది రైల్వే శాఖ.

దేశంలో మహారాష్ట్ర తర్వాత దిల్లీలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 44వేల 688కి చేరింది. 1837 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వేల 500 మంది వైరస్ బారినపడి కోలుకున్నారు.

ఇదీ చూడండి: చైనా బరి తెగింపు- గాల్వన్​ లోయ తమదేనని ప్రకటన

ABOUT THE AUTHOR

...view details