తెలంగాణ

telangana

ఝార్ఖండ్‌ నుంచి లద్దాఖ్​కు 12వేల మంది కార్మికులు!

By

Published : Jun 1, 2020, 6:54 AM IST

ఝార్ఖండ్‌ నుంచి 12,000 మంది కార్మికులను లద్దాఖ్‌, ఇతర సరిహద్దు ప్రాంతాలకు తరలించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా రహదారుల ప్రాజెక్టులను ఆపే ప్రసక్తే లేదని, అందుకే వీరిని అక్కడికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.

12000 jharkhand labour to ladhak
ఝార్ఖండ్‌ నుంచి లద్దాఖ్​కు 12,000 మంది కార్మికులు

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ రహదారుల నిర్మాణం కోసం ఝార్ఖండ్‌ నుంచి 12,000 మంది కార్మికులను లద్దాఖ్‌, ఇతర సరిహద్దు ప్రాంతాలకు తరలించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు 11 రైళ్లు ఏర్పాటుచేయాలని కేంద్ర హోం శాఖను కోరింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన హోం శాఖ రైల్వేశాఖతో మాట్లాడింది.

'ఝార్ఖండ్‌లోని కూలీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వశాఖ అంగీకరించింది. లాక్‌డౌన్‌ సమయంలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించడానికి పాటించిన ప్రామాణిక నిర్వహణ విధానాన్నే (ఎస్‌వోపీ) ఈ రైళ్లకూ పాటిస్తాం' అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌తో మాట్లాడగా.. కూలీలను పంపేందుకు ఆయన అంగీకరించారు. కూలీలను తొలుత రాంచీ నుంచి జమ్మూ, చండీగఢ్‌లకు తీసుకెళతారు. అనంతరం ఆ నగరాల నుంచి లద్దాఖ్‌లోని భారత్‌-చైనా సరిహద్దులకు చేరవేస్తారు.

'తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా రహదారుల ప్రాజెక్టులను ఆపే ప్రసక్తే లేదు' అని రక్షణ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని ప్యాంగాంగ్‌ చెరువు సమీపంలో పరిశీలన కేంద్రం, గాల్వాన్‌ నది మీద 60 మీటర్ల పొడవైన వంతెన సహా సరిహద్దులోని మౌలిక వసతులను పటిష్ఠం చేసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details