తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2022, 8:31 AM IST

ETV Bharat / bharat

బ్రిటిష్​ పన్నులపై పెదనందిపాడు పోరు.. గాంధీ కంటే ముందే అడుగేసి..

AZADI KA AMRIT Pedanandipadu: గాంధీజీ కంటే ముందే అడుగేశారు. యావద్దేశానికి మార్గదర్శకులయ్యారు. పన్నుల నిరాకరణ ఉద్యమంతో ఆంగ్లేయులను గడగడలాడించారు. కానీ చివరకు.. పీత రాజకీయాలతో వెనక్కి తగ్గారు. జాతీయోద్యమంలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన 'ఘనత' ఆంధ్రావని పెదనందిపాడు ఉద్యమం!

AZADI KA AMRIT
AZADI KA AMRIT

Pedanandipadu non cooperation movement: గాంధీజీ నాయకత్వంలో అహింసా పద్ధతుల్లో ఆంగ్లేయులపై పోరాటం కొత్త పంథా తొక్కుతున్న వేళ అది! 1921 అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ మహాసభ దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన.. పన్నుల నిరాకరణ చేపట్టాలని తీర్మానించింది. ఈ విషయం తెలియగానే, గుంటూరు కాంగ్రెస్‌ పార్టీ చొరవ తీసుకొని పెదనందిపాడును పన్నుల నిరాకరణకు సరైన ప్రాంతంగా ఎంచుకుంది. అప్పటికి రాష్ట్ర నాయకులంతా జైళ్లలో ఉన్నారు. మాచిరాజు రామమూర్తి, పర్వతనేని వీరయ్య చౌదరి చొరవ తీసుకొని అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజల్ని శాంతియుతంగా పన్నుల నిరాకరణకు సిద్ధం చేశారు. నాలుగు వేలమంది యువకులతో వీరయ్య చౌదరి శాంతిసేనను ఏర్పాటు చేశారు.

బర్దోలిలో గాంధీజీ ఆరంభించాలనుకున్న ఉద్యమం కంటే ముందే.. పన్నుల సహాయ నిరాకరణ పెదనందిపాడులో మొదలైంది. వీరయ్య చౌదరి మాటకు విలువిస్తూ.. పెదనందిపాడు పరిధిలోని 18 గ్రామాల్లోని కరణాలు, మునసబులు, గ్రామాధికారులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఆంగ్లేయ సర్కారు రెవెన్యూ సభ్యుడైన హారిస్‌ను రాయబారానికి పంపింది. అదీ విఫలమైంది. ఉలిక్కిపడ్డ ఆంగ్లేయ సర్కారు.. ప్రత్యేకంగా అదనపు కలెక్టర్‌ రూథర్‌ఫర్డ్‌ను దించింది. ప్రజలు చెల్లించిందెంత?.. ఇంకా చెల్లించాల్సిందెంత?... ఏ రికార్డులూ అందుబాటులో లేవు. అంతా అయోమయం. రూథర్‌ఫర్డ్‌ రిజర్వ్‌ పోలీసులను, బ్రిటిష్‌ సైన్యాన్ని రప్పించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆంగ్లేయులు ప్రజలపై, శాంతిసైనికులపై ఉమ్మేశారు. తిట్లతో ఉసిగొల్పారు. కానీ శాంతిసైనికుల కారణంగా ప్రజలెవ్వరూ సహనం కోల్పోలేదు. ఆంగ్లేయ సైన్యం ఇళ్లలోకి చొరబడి అందుబాటులో ఉన్న ధాన్యాన్ని స్వాధీనం చేసుకుంది. భూములను వేలం వేశారు. కొనేవారు లేరు. ఉద్యమం ఊపందుకొని.. క్రమంగా జిల్లా అంతటా విస్తరించసాగింది. ప్రభుత్వ వసూళ్లు పడిపోయాయి. గాంధీజీ ఆంగ్లేయ సర్కారుకు రాసిన లేఖలో తెలుగు ప్రజల అహింసా పద్ధతిని ప్రస్తావించటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ పెదనందిపాడుపై పడింది.

ఏ విధంగానూ లొంగకపోవటంతో రూథర్‌ఫర్డ్‌ ప్రజల్ని మతాలు, కులాల పరంగా చీల్చటానికి ప్రయత్నించాడు. మునసబులను బెదిరించాడు. అయినా పెదనందిపాడు ప్రాంత వాసులు చలించలేదు. కులమత భేదాల్లేకుండా, పేదధనిక అంతరాల్లేకుండా అంతా ఏకతాటిపై నిలబడ్డారు. అహింసా పద్ధతుల్లో ఆంగ్లేయులను అల్లాడిస్తూ.. పన్నుల నిరాకరణలో దేశానికి మార్గదర్శకమయ్యారు.

విభేదాలు శాపమై..
అప్పటి ఆంధ్ర కాంగ్రెస్‌ నేతల్లో అభిప్రాయభేదాలు ఈ ఉద్యమం పాలిట శాపమయ్యాయి. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం తరఫున ఓ ఉపసంఘం పెదనందిపాడును అధ్యయనం చేసింది. ప్రజల ఉద్యమ తీరును మెచ్చుకుంటూనే.. ప్రభుత్వం దౌర్జన్యం చేస్తే తట్టుకునే శక్తి ప్రజలకు లేదు కాబట్టి ఉద్యమాన్ని ఆపేయటమే ఉత్తమమని నివేదిక ఇచ్చింది. ఈ గొడవలన్నీ.. గాంధీజీకి చేరాయి. కలత చెందిన ఆయన.. బర్దోలి ఉద్యమ ఫలితాలు అందేదాకా పెదనందిపాడు ఉద్యమాన్ని ఆపాలంటూ సందేశం పంపించారు. ఇది బ్రిటిష్‌ సర్కారుకు కలసి వచ్చింది. రూథర్‌ఫర్డ్‌ ఈ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. పెదనందిపాడు ఉద్యమం ఆపేయగానే.. ఆంగ్లేయ సర్కారు ప్రజలపై ఉక్కుపాదం మోపింది. వీరయ్య చౌదరితో పాటు వందలమందిని అరెస్టు చేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details