దిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని చంపడానికి అమిత్ షా కుట్ర పన్నుతున్నారని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై భాజపా గూండాలు దాడి చేశారని ధ్వజమెత్తారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
"సిసోడియా ఇంటిపై వ్యవస్థపూర్వకంగా పక్కా ప్రణాళికతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన లేని సమయంలో పోలీసుల సమక్షంలో గూండాలు ఇంటిలోకి ప్రవేశించారు. దిల్లీలోని భాజపా శ్రేణులు రోజురోజుకూ ఎందుకు అంత నిరాశ చెందుతున్నాయి" అంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్.
బ్లాక్ డే..
సిసోడియా ఇంట్లోకి బలవంతంగా వెళ్లిన గూండాలను ఆపడానికి పోలీసులు కనీసం ప్రయత్నించలేదని ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. భాజపా గూండాలకు పోలీసులు సహకరించారని దుయ్యబట్టారు. దిల్లీ రాజకీయ చరిత్రలో 'బ్లాక్ డే'గా అభివర్ణించారు మరో ఆప్ ప్రతినిధి. అమిత్ షా.. తన పార్టీ గూండాలను ఉపయోగించి ఆప్ నేతలు, వారి కుటుంబాలపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు.
అందుకే ఇలా..
అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు దిల్లీ భాజపా ఉపాధ్యక్షుడు అశోక్ గోయల్. మేయర్ సహా ఇతర కార్పొరేటర్లను చంపేందుకు అధికార పార్టీనే కుట్ర పన్నిందని, దానిని తప్పుదోవ పట్టించడానికే ఆప్ ఈ ఆరోపణలు చేస్తుందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ధర్నా చేపట్టిన మేయర్ సహా ఇతర కార్పొరేటర్లను చంపేందుకు అధికార పార్టీ కుట్ర పన్నుతోందనే ఆరోపణలతో.. సిసోడియా నివాసానికి సమీపంలో నిరసన ప్రదర్శన చేశాయి భాజపా శ్రేణులు.
ఇదీ చూడండి:నడ్డాపై దాడి- భాజపా, టీఎంసీ మాటల యుద్ధం