YSRCP Leaders Joined TDP Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 9:59 AM IST
|Updated : Sep 25, 2023, 10:53 AM IST
YSRCP Leaders Joined TDP Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా వైసీపీ నేతల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీలో కీలక నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. గిద్దలూరు జెడ్పీటీసీ బుడత మధుసూధన్ యాదవ్తో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్క అవకాశం అని అధికారం చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి.. కక్ష సాధింపు, అరాచక పాలనతో తలెత్తుకు తిరగలేక పోతున్నామని మధుసూధన్ యాదవ్ పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం తమను బాధించిందన్నారు. మధుసూధన్ యాదవ్ ఒంగోలు వచ్చి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం గిద్దలూరులో నిర్వహించిన కార్యకర్తల విస్తృత సమావేశంలో వీరందరూ సైకిల్ ఎక్కారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుని అన్యాయంగా దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రల ప్రజలు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారని అన్నారు.