By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 3:40 PM IST
|Updated : Sep 3, 2023, 6:06 PM IST
YSRCP Activists Provocative Actions: యువగళం పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతల కార్లపై రాళ్లతో దాడి
YSRCP Activists Provocative Actions: నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో మరోసారి వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు అడ్డుకోవడానికి యత్నించడం, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఎన్ని ప్రయత్నాలు చేసినా నారా లోకేశ్ వెనుకడుగు వేయకుండా ముందుకు కదులుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు మరోసారి బరితెగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లోకేశ్ యువగళం పాదయాత్రకి ఏలూరు జిల్లాలో వైసీపీ కవ్వింపు చర్యలతో ఉద్రిక్తత నెలకొంది. నిడమర్రు మండలం మందలపర్రులో పాదయాత్ర సమయంలో ప్లెక్సీలు చూపుతూ.. వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టారు. ప్లెక్సీలు చూపుతూ.. కవ్వింపు చర్యలకు దిగిన శ్రేణులను టీడీపీ నేతలు.. తరిమికొట్టారు. టీడీపీ నేతల కార్లపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఓ టీడీపీ నేత కారు ధ్వంసమైంది. ఆగ్రహించిన టీడీపీ నేతలు.. వైసీపీ వర్గీయులతో ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
కవ్వింపు చర్యలను ఖండించిన టీడీపీ:వైసీపీ కవ్వింపు చర్యలను టీడీపీ ఖండించింది. ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని సర్వేల్లో తెలియడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.