ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా.. తనకు కరోనా సోకడంపై స్పందించారు. తనకు, తన భార్యకు కరోనా లక్షణాలతో తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందామని తెలిపారు. అయితే.. తన భార్యకు గతంలో అనారోగ్యంతో శస్త్ర చికిత్స జరిగిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకిందని.. వైద్యులు, ఉన్నతాధికారులు సూచించిన మేరకే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నామని ఓ ప్రకటనలో వివరించారు.
ఇప్పుడు తమ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగుందని వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రశంసించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.