ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాత రెక్కల కష్టం... దళారీలకు రొక్కం

చీడ పీడలు, వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, జంతువుల బెడద... ఇలా ఎన్నో సమస్యల నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటారు రైతన్నలు. కానీ చేతికందిన  పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలుపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. అవి కమీషన్లకు కక్కుర్తి పడి మిల్లర్లకు దన్నుగా నిలుస్తున్నాయి.

By

Published : Jun 2, 2019, 9:32 AM IST

కొనలేని కేంద్రాలు

కొను'గోల్​మాల్'

అన్నదాతలు పండించిన పంటకు మద్దతుధర దక్కడం... దళారీల బెడద నుంచి రైతులను రక్షించడం ధాన్యం కొనుగోలు కేంద్రాల కర్తవ్యం. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు ఇందుకు భిన్నంగా ఉంది. రబీ సీజన్​కు సంబంధించి జిల్లాలో 294 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కచోట కూడా ధాన్యం కొన్న పరిస్థితి కనిపించడం లేదు. రికార్డుల్లో మాత్రం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలు సహకారం అందించనందున రైతులు తమ పంటను దళారీలకు అమ్ముకుంటున్నారు. అధిక తేమ శాతం, తరగు అంటు.. వ్యాపారులు రైతును దగా చేస్తున్నారు. మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసి.. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి తీసుకొన్నట్లు నమోదు చేస్తున్నారు.

మద్ధతు ధరకు చిల్లు

జిల్లాలో రబీ కింద సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరిపంట సాగయింది. దాదాపు 13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. వరినూర్పిళ్లు పూర్తయి 3 వారాలకు పైగా అయినా... నేటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుత ధాన్యం మద్దతుధర క్వింటాకు 1590, 1550గా నిర్ణయించగా.... రైతుకు దక్కుతున్నది కేవలం 13 వందల 50 రూపాయలు మాత్రమే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details