ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIBRARY: మాతృభాషలో ప్రతిభ.. 70 నుంచి 100 వరకూ పద్యాలు, శ్లోకాలు కంఠస్థం..

అమ్మ జన్మనిచ్చిన తర్వాత.. పిల్లాడికి కాస్త తెలివొచ్చినా.. అన్నీ తెలిసొచ్చేది మాత్రం.. మాతృభాష ఒంటబట్టాకే..! కాస్త వయసొచ్చాక..గతానికి గుండె ఘోష..వర్తమాన శ్వాస..భవితపై ఆశ..! ఇలా.. అన్నింటికీ అర్థం చెప్పేదీ..మన మాతృభాష తెలుగే..! ఇలాంటి మాధ్యమంపై పరాయి భాషలు దాడిచేస్తున్నా.. బోధనలు, రచనలతో.. భావితరాలకు కొందరు తెలుగుభాష గొప్పదనం, తియ్యదనం రుచి చూపిస్తున్నారు. ఈ దారే ఎంచుకున్న ఓ భాషా పండితుడు.. వివిధ బాధ్యతలతో తెలుగుపక్షాన నిలుస్తున్నారు. ఎవరాయన? మాతృభాష కోసం ఏం చేస్తున్నారు? ఇంతకీ ఏ ఊరు?

By

Published : Aug 29, 2021, 12:46 PM IST

library
మాతృభాషలో ప్రతిభ చాటుతున్న విద్యార్థినులు

మాతృభాషలో ప్రతిభ చాటుతున్న విద్యార్థినులు

మాటలు నేర్చింది మొదలు.. గుక్క తిప్పకుండా మాట్లాడేవరకూ.. మనం మాతృభాషను పలకని సందర్భం ఊహించగలమా..? తెలుగువారు ఎక్కడుంటేనేం.. నిద్ర లేవడంతో ప్రారంభించి.. వినసొంపైన మాటలతోనో.. హాయిగొలిపే పాటలతోనో.. రోజు గడిపేస్తూ ఉంటారు. ఇక్కడ విద్యార్థినులు చేస్తోందీ ఇదే..! భాషపై మక్కువ ఉన్న గురువు కల్పించిన ఆసక్తితో.. గ్రంథాలయంలో పుస్తకాలు తిరగేస్తూ.. తెలుగును ఔపోశన పట్టేస్తున్నారు.

ఆరువేల పుస్తకాలతో గ్రంథాలయం..

ఈ మాస్టారు పేరు రాంబాబు..! ఈయన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సీతానగరం పాఠశాలకు భాషా పండితుడిగా వచ్చిన కొత్తలో.. సుమారు వెయ్యి పుస్తకాలు బీరువాలో మూలుగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించిన మాస్టారు.. పుస్తక పఠనం విలువైనదని చాటి చెప్పేందుకు పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చేశారు. ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్థుల సహకారంతో.. సుమారు 6 వేల పుస్తకాలతో బడిలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.

ఆ గదిలోనూ పుస్తకాలు..

గ్రంథాలయంలో విద్యార్థులతో రోజూ పుస్తకాలు చదివిస్తూ.. సెలవు రోజుల్లో 2 పుస్తకాలను ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నారు. బడిలో గ్రంథాలయం ఏర్పాటుతో ఆగిపోని రాంబాబు మాస్టారు.. రామమందిరానికి చెందిన గదిలోనూ చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశారు. స్థానికుల విరాళాలతో.. ర్యాక్‌లు, రెండు కంప్యూటర్లు పెట్టారు. పాఠశాలకు పోలీసులు ఒక కంప్యూటర్, ప్రొజెక్టర్‌ అందజేశారు.

అనర్గళంగా తెలుగు ఉచ్చారణ..

మాతృభాషలో ఒక్కొక్క విద్యార్థిని 70 నుంచి వందవరకూ పద్యాలు, శ్లోకాలు చెప్పేస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులూ గెలుచుకున్నారు.గ్రంథాలయ ఏర్పాటు తర్వాత.. అంతే చక్కగా పిల్లలు తెలుగులో రాటుదేలేలా మెలకువలు నేర్పుతున్న రాంబాబును.. అందరూ మెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయుల నుంచి.. స్థానికుల వరకూ.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

పుట్టిన రోజునాడు పుస్తక వితరణ..

చదివిన పుస్తకంపై విద్యార్థులు సమీక్ష రాసినప్పుడే.. తెలుగును భావితరాలకు సురక్షితంగా అప్పగిస్తారని.. రాంబాబు చెబుతున్నారు. భావితరాలకు మాతృభాష తీపిదనం అందించే బాధ్యత అందరిపైనా ఉందంటున్నారు. పౌర గ్రంథాలయాల్లో ఎలాగైతే పుస్తక నిర్వహణకు సంబంధించిన దస్త్రాలుంటాయో.. ఇక్కడా అదేతీరులో నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, పిల్లలు తమ పుట్టిన రోజున ఏదో ఒక పుస్తకాన్ని.. గ్రంథాలయానికి వితరణ చేసేలా బుక్‌ బ్యాంకు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండీ..Brutal Murder: సత్తెనపల్లిలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య

ABOUT THE AUTHOR

...view details