అవినీతిపరులను పట్టుకునేందుకు ‘అనిశా’ అధికారులు తమ వ్యూహాలకు మరింతగా పదును పెడుతున్నారు. విశాఖ నగరంలోని అనిశా కార్యాలయానికి వెళ్లి కొందరు బాధితులు ఫిర్యాదులు చేసేవారు. కొందరు ఫోన్లలో చెప్పేవారు. వాటికి అదనంగా రాష్ట్ర టోల్ఫ్రీ నెంబరు నుంచి కూడా పలు ఫిర్యాదు వస్తుండడంతో వాటికి అగ్రప్రాధాన్యం ఇచ్చి మరీ వాస్తవాలు నిగ్గుతేలుస్తున్నారు. టోల్ఫ్రీ నెంబరుకు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య గణ నీయంగా పెరుగుతుండడంపై అధికారులను మరింతగా దృష్టికేంద్రీకరించారు. అత్యధిక ఫిర్యాదుదారులు తగిన సాక్ష్యాలు సమర్పించకుండా కేవలం సమాచారం మాత్రమే ఇస్తుండడం, బాధితులు కూడా తమ పని పూర్తైతే చాలన్న ధోరణిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం కొంత సమస్యగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.
- రెవెన్యూ, జీవీఎంసీ, పంచాయతీరాజ్, తదితర విభాగాల ఉద్యోగులపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడం గమనార్హం. పలువురు పట్టుబడుతున్నా ఆయా శాఖల్లో గుట్టుచప్పుడు కాకుండా అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- అక్రమాస్తుల కేసుల్లో నిందితుల ఆస్తులను జప్తు చేసుకునే విధానం కూడా అమల్లోకి వచ్చింది. కేసు తుది తీర్పు నిందితులకు వ్యతిరేకంగా వస్తే ఆయా ఆస్తులు పూర్తిగా ప్రభుత్వానికే స్వాధీనం చేయకతప్పదు.
వివాదాలెందుకున్న ధోరణి వీడాలి
ఫిర్యాదు చేస్తే ఎక్కడ అది వివాదం అవుతుందోనని చాలామంది భయపడుతుంటారు. ఏమాత్రం భయపడకుండా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. కొందరు డబ్బులు ఇచ్చేసిన తరువాత మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. లంచాలు ఇవ్వకముందే ఫిర్యాదు చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లంచం కింద ఇచ్చే మొత్తాన్ని కూడా చట్టప్రకారం తిరిగి బాధితులకు ఇప్పించేస్తాం.