ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 10, 2020, 8:24 PM IST

ETV Bharat / state

'మాన్యువల్ పద్ధతిలోనే ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి'

ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో చినికి చినికి గాలివానగా మారుతోంది. సంఘాలు చేసిన సూచనలు విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా ఇవాళ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

'మాన్యువల్ కౌన్సెలింగ్ పద్ధతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి'
'మాన్యువల్ కౌన్సెలింగ్ పద్ధతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి'

శ్రీకాకుళం జిల్లాలో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. తప్పనిసరి బదిలీల్లో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. వారికి కొత్త స్థానం కేటాయింపు ఎక్కడ ఉంటుందో తెలియక సతమతమవుతున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం సిద్ధపడటమే ఇందుకు కారణం. గతంలో ప్రత్యక్ష కౌన్సెలింగ్‌లో ఖాళీలను బహిర్గతం చేసి చూపేవారు. దీనికి అనుగుణంగానే ఉపాధ్యాయులు నచ్చిన స్థానాన్ని కోరుకొనేవారు. కానీ వెబ్ కౌన్సెలింగ్‌లో ఇలా కుదరదు. ఆప్షన్లు పెట్టుకొవటమే ఉపాధ్యాయుల పని... కేటాయింపు ఉన్నతాధికారులపై ఆధారపడి ఉంటుంది.

బదిలీల ప్రక్రియలో సందిగ్ధత తలెత్తుతున్న నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పూర్తవుతుందా..? అన్న అనుమానాలు తలెత్తున్నాయి. జాబితా ప్రకటన ఈనెల 8 నుంచి 10 మధ్య పూర్తి చేయాలి. వెను వెంటనే వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 11 నుంచి 25 తేదీల మధ్య చేపట్టాలి. బదిలీల ఆర్డర్‌లు ప్రదర్శన 16 నుంచి 21 తేదీల మధ్య ఉంటుంది. సాంకేతిక సమస్యలపై 22, 23 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం 24న బదిలీల ఆర్డర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధ్యాయు పోస్టుల కుదింపు జరుగుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఖాళీలను బ్లాక్​ చేయటం దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం స్పందించి పోస్టుల కుదింపును తగ్గించాలి.

- గిరిధర్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి.

విద్యాశాఖ గుర్తించిన ప్రాథమిక జాబితాను మించి ఖాళీలు బ్లాక్ చేసిన పోస్టులు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేయటంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు బదిలీ కోరుకుంటున్న ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేటాయించిన అదనపు పోస్టులు పెద్ద సంఖ్యలో ఉండటంతో మంచి స్థానాలు దక్కుతాయని వీరంతా ఆశించారు. తీరా వందల కొద్దీ పోస్టులు కనబడకుండా పోవటంతో దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతోంది. పోస్టులు బ్లాక్ చేయొద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఫ్యాప్టో ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలత వ్యక్తం కాలేదు. వీరంతా ఈరోజు ఆందోళన బాట పట్టారు.

మహిళా టీచర్ కష్టాలు ప్రభుత్వానికి తెలియటం లేదు. దూర ప్రాంతాల్లో పోస్టింగ్​లు ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది. వెబ్ కౌన్సెలింగ్ తీసేసి మాన్యువల్ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధానం బదిలీల్లో ఉపాధ్యాయులు నష్టపోతున్నారు.

- వాగ్ధేవి, ప్రధానోపాధ్యాయురాలు

ఇదీచదవండి

ఏలూరు వింత వ్యాధి: ఆసుపత్రికి మరో 13 మంది బాధితులు

ABOUT THE AUTHOR

...view details