ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నాం: ఆళ్ల నాని

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. వైద్యం అందక ఎవరూ చనిపోకూడదనేదే తమ లక్ష్యమని నాని స్పష్టం చేశారు.

By

Published : Sep 21, 2020, 4:47 PM IST

deputy cm alla nani in sithampet srikakulam district
ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి

తమ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైద్యం అందక ఎవరూ చనిపోకూడదనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సమాయత్తమవుతున్నామని తెలిపారు. ముఖ్యంగా గిరిజనులకు మేలైన వైద్యం అందించేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ఆసుపత్రులను దాదాపు రూ. 2 వేల కోట్లతో ఆధునికీకరణ చేయబోతున్నట్లు ఉపముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో రూ. 16వేల కోట్లతో వైద్య వ్యవస్థ మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరోనా వైరస్​ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. సీతంపేటలో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం ఎంపిక చేసి నెలరోజుల్లోగా టెండర్ ప్రక్రియ నిర్వహించి.. త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి..

భాజపా కుట్రలకు వైకాపా, తెదేపా మద్దతిస్తున్నాయి: శైలజానాథ్

ABOUT THE AUTHOR

...view details