తెదేపా ఎమ్మెల్యేను అడ్డుకున్న వైకాపా.. ఇలాగైతే ఎలాగప్పా?
అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొండపిలో రైతు దినోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేను.. వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రకాశం జిల్లా కొండపిలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. రైతు దినోత్సవానికి హాజరుకాకుండా చేశారు. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లాలంటూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేసిన పరిస్థితుల్లో.. కల్యాణ మండపం బయటే ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి మారలేదు. వైకాపా కార్యకర్తల తీరుపై.. తెదేపా శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తే.. అడ్డుకోవడం దారుణమని ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఆగ్రహించారు. శాంతిభద్రతల సమస్య రాకూడదని పోలీసులకు చెప్పి కార్యక్రమానికి వచ్చినా.. వైకాపా కార్యకర్తలను ఖాకీలు నిలువరించలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు పోలీసులో రక్షణ కల్పించలేకపోతే ఎలా అని బాలవీరాంజనేయస్వామి నిలదీశారు.