ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో జరిగిన భూ ఆక్రమణ ఘటనలో.. తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూమిని తహసీల్దార్తో సహా.. కింది స్థాయి సిబ్బంది డబ్బులు తీసుకొని ఇతరులకు కట్టబెట్టారు. అప్పట్లో ఈ భూ ఆక్రమణ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పటి కందుకూరు ఆర్డీఓ రామారావును విచారణ అధికారిగా నియమించారు.
ఆక్రమణకు పాల్పడినట్టుగా తేలిన నాటి తహసీల్దార్ విజయభాస్కర్ రెడ్డి.. అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ కేసుకు సంబంధించి.. నేడు కంప్యూటర్ ఆపరేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆర్ఐ సాలమ్మ, రమణతో పాటు మరికొంత మంది అధికారులకు భూ ఆక్రమణలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరింత విచారణ చేసి ఈ నేరంలో పాత్ర ఉన్న మిగతా అధికారులపైనా చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.