Restoration Revenue Divisions: రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన రెండు రెవెన్యూ డివిజన్లలో మార్పులు జరిగాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా ప్రకటించిన పొదిలికి బదులు కనిగిరిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా గుర్తిస్తూ ప్రభుత్వం సవరణ గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చింది. అనంతపురం జిల్లాలో కదిరినే తిరిగి రెవెన్యూ డివిజన్గా ప్రకటించింది. ఈ మార్పులకు మంత్రులు ఆన్లైన్ ద్వారా ఆమోదం తెలిపారు.
- ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరిని రెవెన్యూ డివిజన్గా గుర్తిస్తూ తొలుత కేబినెట్ ఆమోదించింది. గెజిట్ నోటిఫికేషన్లో కనిగిరిని కాకుండా పొదిలి పేరు ప్రకటించారు. దీనిపై కనిగిరి ప్రాంతంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వైకాపా నాయకులు మాత్రం పొదిలినే కొనసాగించాలని కోరారు. తుదకు కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి 13 మండలాలను చేర్చుతూ సవరణ చేశారు.
- అనంతపురం జిల్లా పుట్టపర్తి కేంద్రంగా కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించింది. దీని పరిధిలో పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లు ఉంటాయని పేర్కొంది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని 12 మండలాలతో కలిపి 2013లోనే కదిరి డివిజన్ ఏర్పాటైంది. తాజాగా కదిరికి బదులు పుట్టపర్తి పేరు ప్రకటించడంపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బుధవారం చేసిన సవరణల్లో కదిరినే డివిజన్గా గుర్తిస్తూ దాని పరిధిలోకి 8 మండలాలను చేర్చింది.
- నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాలోని గురజాల రెవెన్యూ డివిజన్లో అప్పటికే ఉన్న 9 మండలాలతోపాటు అదనంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలను (గుంటూరు డివిజన్ నుంచి) చేర్చారు. దీంతో మండలాల సంఖ్య 14కి చేరింది. నరసరావుపేట డివిజన్లో అప్పటికే ఉన్న 11 మండలాలకు అదనంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలను (గుంటూరు డివిజన్ నుంచి) కలిపారు. దీనివల్ల నరసరావుపేట డివిజన్లోనూ మండలాల సంఖ్య 14కు చేరుకుంది. అయితే తమ మండలాలను గురజాల డివిజన్లో కలిపితే దూరమవుతుందని పెదకూరపాడు నియోజకవర్గ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. స్థానికుల నుంచీ నిరసన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం సవరణ చేసింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలను గురజాల డివిజన్ నుంచి తొలగించి నరసరావుపేటలో చేర్చింది. బెల్లంకొండ మండలాన్ని గురజాలలోనే కొనసాగించింది. దీంతో గురజాల డివిజన్లోకి పది, నరసరావుపేట డివిజన్లోకి 18 మండలాలు వచ్చాయి.
- చిత్తూరు జిల్లాలో కొత్తగా ప్రకటించిన పలమనేరు రెవెన్యూ డివిజన్లో చేర్చిన రొంపిచెర్ల మండలాన్ని తాజాగా చిత్తూరు డివిజన్లోకి మార్చింది.