ప్రకాశం జిల్లా పర్చూరులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్చూరు, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి సుమారు 3 లక్షల 70 వేల రూపాయిల విలువ చేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు మండలం కొణిజెడు గ్రామానికి చెందిన జయంపు సుబ్బరావు, నెల్లూరు జిల్లా గూడూరు మండలం తోటపల్లికి చెందిన రావూరి లక్ష్మయ్య.. బావ, బావ మరుదులు.
వ్యసనాలకు అలవాటు పడి ఇద్దరూ దొంగతనాల బాట పట్టారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ఉదయం పూట రెక్కీ నిర్వహించి రాత్రులు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇటీవల అద్దంకి, పర్చూరు, మార్టూరు ప్రాంతాలలోని ఇళ్లల్లో వరుస చోరీలు జరగడంపై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పర్చూరు బస్టాండ్ సెంటర్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విషయం బయటపడింది. వీరు గతంలోనూ చోరీ కేసుల్లో జైలుపాలైనట్టు పోలీసులు తెలిపారు.