ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 30, 2020, 4:12 PM IST

ETV Bharat / state

పోషక హాహాకారం...!నీళ్ల సాంబారు, మజ్జిగే దిక్కు

కొవిడ్‌ బాధితులకు నాణ్యమైన ఆహారం అందించాలి... రోజువారీ భోజనంలో పౌష్టిక విలువలున్న పదార్థాలు వడ్డించాలి. ఒక్కో బాధితుడి భోజనానికి రోజుకు రూ.350 చొప్పున కేటాయిస్తున్నాం. తదనుగుణంగా మెనూ ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నా- క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. మార్కాపురం కొవిడ్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు పౌష్ఠికాహారం అందని ద్రాక్షగా మిగులుతోంది. ఇక్కడి బాధితులకు నీళ్ల సాంబారు, మజ్జిగ, పురుగులున్న భోజనం వడ్డిస్తున్నారు. ఈటీవీ భారక్ ఆసుపత్రిని పరిశీలించగా- ఆయా విషయాలు వెలుగుచూశాయి.

praksam district
మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాల

ప్రకాశం జిల్లా మార్కాపురం కొవిడ్‌ వైద్యశాలలో కొవిడ్ బాధితలు పరిస్థితి మరీ దారుణంగా మారిందని వారు వాపోతున్నారు. సరైన ఆహారం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల సాంబారు, మజ్జిగే దిక్కని.. భోజనంలోనూ పురుగులు ఉంటున్నాయని తెలిపారు.

మూడు నియోజకవర్గాల బాధితులు...

మార్కాపురం జిల్లా ఆసుపత్రిలో గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లోని కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఒంగోలు తరువాత మార్కాపురంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అందులో కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నవారిని మాత్రమే ఒంగోలు జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. మిగిలిన వారిని మార్కాపురం ఆసుపత్రిలోనే వైద్యమందిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 80 మందికి పైగా బాధితులున్నారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం సరిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఉదయం చిన్నగ్లాసులో పాలు, మగ్గిపోయిన రొట్టె మాత్రమే ఇస్తున్నారని... మధ్యాహ్నం నీళ్ల సాంబారు, మజ్జిగతో సరిపెట్టుకుంటున్నారని వాపోయారు. ఒక్కోసారి భోజనంలో పురుగులు ఉంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. కొందరైతే కుటుంబ సభ్యుల సహకారంతో బయట నుంచి భోజనం తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.

గుత్తేదారుపై ఆగ్రహం

భోజనంలో నాణ్యతలేమి విషయాన్ని ‘న్యూస్‌టుడే’ ఆసుపత్రి పర్యవేక్షణాధికారి టి.విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లింది. ఆమె భోజనాన్ని పరిశీలించి గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే చర్యలకు సిపార్సు చేస్తానని హెచ్చరించారు. కొవిడ్‌ బాధితులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేఎస్‌ఎస్‌కే పథకం ద్వారా ఒక్కో వ్యక్తి భోజనానికి రోజుకు రూ.100 చొప్పున కేటాయిస్తున్నామని, త్వరలోనే రూ.350 చొప్పున కొవిడ్‌ మెనూ అమలు చేస్తామని పేర్కొన్నారు.

మెరుగైన సౌకర్యాలు కల్పించండి: జేసీ

స్థానిక జిల్లా వైద్యశాలలో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు సౌకర్యాలు కల్పించాలని సంయుక్త కలెక్టర్‌ చేతన్‌ ఆదేశించారు. స్థానిక వైద్యశాలను బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. బాధితులకు అందజేస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణాధికారి డాక్టర్‌ విజయలక్ష్మితో మాట్లాడారు. ఆసుపత్రిలో కరోనా రోగులు ఎందరు ఉన్నారు? వారికి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి వైద్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా విధులు నిర్వర్తించడం సరికాదని మండిపడ్డారు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలు, వైద్యశాలలను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శేషిరెడ్డిని ఆదేశించారు. భోజనం నాణ్యత పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో, పర్యవేక్షణాధికారితో పాటు డీఎఫ్‌వో బబిత, ఎంపీడీవో హనుమంతరావు తదితరులున్నారు.

మాది మార్కాపురం. నా భర్తకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ కావడంతో... ఈ నెల 22న జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ భోజనం దారుణంగా ఉంది. అన్నంలో పురుగులు వస్తున్నాయి. రోజూ సాంబారే పోస్తున్నారు. అదికూడా నీళ్లలా ఉంటోంది. ఆ భోజనం తినలేక నీరసానికి గురవుతున్నారు. ఒక్కోసారి ఫోన్‌ చేస్తే ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చి వడ్డిస్తున్నాం. - ఓ బాధితుడి భార్య ఆక్రందన

మా ఊరు గిద్దలూరు. కరోనా పాజిటివ్‌ రావడంతో... ఈ నెల 25న మార్కాపురం జిల్లా ఆసుపత్రికి వచ్చాను. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. భోజనం అధ్వానంగా ఉంది. రోజూ ఉదయం చిన్న గ్లాసులో నీళ్లపాలు, రొట్టె ఇస్తున్నారు. మధ్యాహ్నం ముద్ద కట్టిన అన్నం, నీళ్ల సాంబారు, మజ్జిగ అందజేస్తున్నారు. ఆ భోజనం తినలేక పారబోస్తున్నాం. మధ్యాహ్నం మిగిలిన కూరలే రాత్రి ఇస్తున్నారు. పౌష్టికాహారం దేవుడెరుగు... కనీసం నాణ్యమైన అన్నం వడ్డిస్తే చాలు.

- ఓ బాధితుడి ఆవేదన

ఇదీ చదవండిప్రకాశం జిల్లాలో బయటపడ్డ.. ప్రాచీన సమాధులు

ABOUT THE AUTHOR

...view details