పర్చూరులో తమ శాఖకు చెందిన స్థలాలు అన్యాక్రాంతమైనా పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు.. ప్రైవేటు వ్యక్తుల భూములను మాత్రం తమవిగా చూపడంతో పలు చిక్కులు తలెత్తుతున్నాయి. తప్పు వారు చేసినా.. సమస్య పరిష్కారం కోసం రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సొంత భూములైనప్పటికీ రిజిష్ట్రేషన్లు జరగడంలేదు. ఈసీల్లో దేవాదాయ భూమిగా రావడంతో బ్యాంకు రుణాలు సైతం పొందలేని పరిస్థితి. చివరకు పిల్లల వివాహాలు, చదువులు, ఇతర కుటుంబ అవసరాలకు సైతం పొలం విక్రయించుకోలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు.
అన్యాక్రాంతమైనా పట్టదు
జిల్లా వ్యాప్తంగా దాదాపు 12,500 ఎకరాల దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతమైనట్లు.. రెండేళ్ల క్రితం ఆ శాఖ అధికారులు చేపట్టిన సర్వేలోనే వెల్లడైంది. కొందరు వ్యక్తులు ఏళ్లుగా వాటిని అనుభవిస్తున్నారు. ఎకరానికి కనీస కౌలు రూ.10 వేలు చొప్పున లెక్కించినా ఏడాదికి రూ.12 కోట్ల మేర ఆదాయాన్ని ఆ శాఖ కోల్పోతోంది. ఒంగోలు, ఇడుపులపాడు, పర్చూరు, సింగరాయకొండ, అద్దంకి తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు సైతం వెలిశాయి. ఇలా ఆక్రమణకు గురైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. మరోవైపు రైతులకు చెందిన భూములు, స్థలాలను దేవాదాయశాఖవిగా నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
మారిన విధానంతో చిక్కులు
గతంలో సమస్య తలెత్తినపుడు.. జిల్లా అధికారులు కమిషనర్ కార్యాలయానికి వివరాలు పంపితే పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేసేవారు. గత కొద్ది కాలంగా ఈ విధానంలో మార్పులు చేశారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తును సంబంధిత ఈవో, ఇన్స్పెక్టర్ పరిశీలించి నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగా సహాయ కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి డిజిటల్ ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. అనôతరం కమిషనర్ కార్యాలయానికి వివరాలు నివేదించాలి. తదుపరి అక్కడ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. చెప్పేందుకు సులువుగా ఉన్నా.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఎంత కాలం పడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.