ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో కల్తీ దందా.. ఆగేది లేదా?

కుళ్లిన కూరగాయలు.. మురిగిన మాంసం.. పురుగులతో కూడిన ఐస్ క్రీములు. నెల్లూరు ప్రజలారా జాగ్రత్త. అధికారుల దాడుల్లో బయటపడిన ఈ దారుణమైన విషయాలు తెలుసుకోండి. బయట తినేందుకు వెళ్లినా.. తినుబండారాలు కొనుక్కోవాలనుకున్నా.. జాగ్రత్త పడండి. అపాయాన్ని తప్పించుకోండి.

By

Published : Jul 31, 2019, 12:41 AM IST

నెల్లూరులో కల్తీ దందా.. ఆగేది లేదా?

హోటళ్లలో వంటలపై ప్రజల అనుమానాలను నిజం చేశారు.. నెల్లూరులోని కొందరు కల్తీగాళ్లు. శాఖాహారం.. మాంసాహారం తేడా లేకుండా.. ఐస్ క్రీములతో సహా కల్తీ చేసేస్తున్నారు. ఈ మధ్య నిర్వహించిన దాడుల్లో.. అధికారులు ఈ దారుణాన్ని గుర్తించారు. పురుగులు పట్టిన ఆహారాన్ని.. రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలను బయటపెట్టారు. అప్పటికే కుళ్లిపోయిన మాంసానికి రంగులు పూస్తున్న విషయాన్ని గుర్తించారు. వాటికే మసాలాలు దట్టిస్తూ.. జనాన్ని మోసం చేస్తున్న తీరును బయటపెట్టారు.

బిరియానీ దర్బార్.. సింహపురి రుచులు.. ప్రిన్స్ హోటల్... మూలపేట అలంకార్ సెంటర్లోని సాయి హోటల్​తో పాటు.. ఐస్ క్రీమ్ సెంటర్లు, బస్టాండ్ సమీపంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మాంసం దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. చాలా చోట్ల కుళ్లిన మాంసం, మురిగిన కూరగాయలు, దుర్వాసనతో ఉన్న రొయ్యలు చూసి... అధికారులకే కళ్లు తిరిగినంత పనైంది. నెల్లూరుతో పాటు కావలి, ఆత్మకూరు, నాయుడుపేటల్లోనూ కల్తీదందా బయటపడింది. ఇలాంటివి తింటే.. జీర్ణకోశ వ్యాధులు ఖాయమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొందరు చేసే పనితో.. అందరిపై ప్రభావం పడుతుంది. కొన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు చేసే కల్తీతో.. మిగతావాటినీ అనుమానించాల్సివస్తుంది. అందుకే... ఆరోగ్యశాఖ, ఫుడ్ ఇన్​స్పెక్టర్లు.. నిత్యం తనిఖీలు చేస్తుండాలి. అనుమతులు, నిర్వహణ తీరు పరిశీలిస్తుండాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు కానీ.. ఇలాంటి కల్తీ దందా కాస్త తగ్గదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నెల్లూరు హోటళ్లపై తనిఖీ చేస్తున్న అధికారులు

ఇదీ చూడండి బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల అమ్మకాలతో నష్టాలు

ABOUT THE AUTHOR

...view details