Nara Lokesh Yuvagalam Padayatra: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 147వ రోజు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సందడిగా సాగింది. డప్పు వాయిద్యాలు. నృత్యాలుతో అభిమానులు లోకేశ్ వెంట నడిచారు.. సాలుచింతల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలు కాగా.. భారీ గజమాలలతో యువనేతకు గ్రామాల్లో జనం నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పట్టి, గుమ్మడికాయలు కొట్టి దిష్టితీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. బాణసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పాదయాత్ర హోరెత్తింది. సాలుచింతల వద్ద పాదయాత్ర 1900 కిలోమీటర్ల మైలురాయికి చేరడంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
దారిపొడవునా వినతులు.. అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. వరి రైతాంగం పండించిన ధాన్యం నాణ్యత మెరుగుపడి మార్కెట్లో మంచి ధరకు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. దారిపొడవునా ప్రజల నుంచి యువనేతకు వినతులు వెల్లువెత్తాయి. సమస్యలను ఓపిగ్గా విన్న యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ 68,294 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ వచ్చాక అందులో నాలుగోవంతు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కోవూరు ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం అన్నారు. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందిని అన్నారు.