అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడుగడుగునా అడ్డుపడుతూ.. బలవంతంగా నామినేషన్ పత్రాలు చించుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా భాజపా నేత సుశీల అనే మహిళ నామినేషన్ వేసేందుకు మూడు గంటలకు గ్రామంలోని సచివాలయం కేంద్రానికి వెళ్లింది. అక్కడికి వెళ్లగానే ఆమె చేతుల్లోని నామినేషన్ పత్రాలను వైకాపా మండల కన్వీనర్ రఘనాథ్ రెడ్డి బలవంతంగా లాక్కుని చించారని ఆమె వాపోయింది.
ఏడ్చినా పట్టించుకోలేదు..
వెంటనే మరల నామపత్రాలను సిద్ధం చేసి కార్యాలయంలోకి వెళ్లగా స్థానిక మండల వైకాపా నేత వారిని అడ్డుకున్నారు. 4:50 నిమిషాలకు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని అడ్డుకొని సమయం మించిపోయిందంటూ తలుపులు మూసేశారు. దీంతో సుశీల మద్దతుదారులు సచివాలయం ఎదుట కూర్చొని నిరసన చేపట్టారు. ఇరుపార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించారని ఆమె ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ సుశీల మద్దతుదారులు అక్కడే బైఠాయించారు. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియడంతో వారు చర్యలు చేపట్టారు. ఆమెతో నామినేషన్ వేయించారు.