ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM VIDEO CONFERENCE: మాదక ద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం: సీఎం జగన్

CM JAGAN VIDEO CONFERENCE WITH COLLECTORS: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ భాగంగా అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. కీలక ఆదేశాలను జారీ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

By

Published : Apr 28, 2023, 10:07 PM IST

Published : Apr 28, 2023, 10:07 PM IST

CM JAGAN
CM JAGAN

CM JAGAN VIDEO CONFERENCE WITH COLLECTORS: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ భాగంగా అధికారులతో ఆయన పలు కీలక పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అధికారులు రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

మే 9 నుంచి 'జగనన్నకు చెబుదాం'.. సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు 'జగనన్నకు చెబుదాం' పేరిట సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 9వ తేదీన ప్రారంభిస్తోందని.. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం కలెక్టర్‌కు రూ. 3 కోట్లు చొప్పున నిధులు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పలు పథకాల అమలుపై సమీక్షించిన సీఎం.. పలు కీలక ఆదేశాలిచ్చారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 48 వేల మంది పేదలకు ఏపీ సీఆర్డీయే ప్రాంతంలో మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయలన్నారు. విద్యాకానుక కిట్లలో నాణ్యత పాటించాలన్నారు. నాడు-నేడు పనులను మూడు దశల్లో పూర్తి చేస్తామన్నారు. మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నవారు, రవాణా, పంపిణీ చేస్తున్న వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

స్పందనకు మెరుగైన రూపమే ఈ జగనన్నకు చెబుదాం.. అనంతరం 'జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, విద్యాశాఖలో నాడు–నేడుపై' కూడా సీఎం జగన్ సమీక్షించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం 1902 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రవేశపెట్టమన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమానికి మరింత మెరుగైన రూపమే ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమం అని సీఎం జగన్ గుర్తు చేశారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడంసహా వ్యక్తిగత గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయని, ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సైతం పర్యవేక్షిస్తుందన్నారు.

మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించాలి..నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సమీక్షించిన సీఎం జగన్.. పలు ఆదేశాలిచ్చారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని, 2022–23 సంవత్సరంలో 10,203 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 15 వేల 810 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశించారు. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలన్నారు. కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించాలన్నారు. ప్రతి శనివారం హౌసింగ్‌ డేగా పరిగణించాలని, హౌసింగ్‌ కార్యక్రమంలో నిమగ్నమైన అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలన్నారు.

రైతులకు భూ హక్కు పత్రాలు అందించాలి.. రాష్ట్రంలోని మొత్తం 17వేల 464 రెవెన్యూ గ్రామాలకు గానూ.. మొదటి విడతలో 2వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు- భూ రక్ష పథకం కింద రీ సర్వే చేపట్టినట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంటోందన్నారు. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టి.. రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీతోపాటు తర్వాత దశల్లో సర్వే చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలన్నారు. పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలన్నారు. మే 25 నుంచి రెండో దశలో మరో 2వేల గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుందని సీఎం స్పష్టం చేశారు.

అత్యంత కఠినంగా వ్యవహరించండి.. చివరగా పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. జూన్‌ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్‌ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలన్నారు. రెండో దశలో రూ. 16 వేల 461 యునిక్‌ స్కూళ్లలో నాడు నేడు చేపడుతున్నామని, ఫేజ్‌ 3లో సుమారు మరో రూ. 13 వేల స్కూళ్లలో నాడు నేడు కింద పనులు జరగనున్నాయన్నారు. మూడు విడతల్లో దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు –నేడు పనులు పూర్తవుతాయన్నారు. వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాలు ఉంటాయని, ఈ సమయాన్ని పనుల కోసం బాగా వినియోగించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. జూన్‌ 12న పాఠశాలలు తిరిగి తెరుస్తారని, అదేరోజు వారికి విద్యాకానుక అందించాలని సీఎం నిర్దేశించారు. మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ప్రతి కాలేజీలోనూ ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని, పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ పెట్టాలన్నారు. కాలేజీల్లో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మాదకద్రవ్యాలు తయారుచేస్తున్నవారు, రవాణా, పంపిణీ చేస్తున్నవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details