ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు

Shivaratri celebrations across the state: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల తెప్పోత్సవాలు, మరికొన్ని దేవాలయాల్లో రథోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు ముక్కంటి సేవలో పాల్గొని తరించారు.

By

Published : Feb 20, 2023, 12:24 PM IST

Shivaratri celebrations
శివరాత్రి వేడుకలు

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Shivaratri celebrations across the state:శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు రాత్రి శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. తెప్పను రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించి పుష్కరిణిలో విహరింపజేశారు. కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాల రామలింగేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తి నారద పుష్కరణిలో జోడు తెప్పలపై కొలువైన ఆది దంపతులు... భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెప్పోత్సవం తర్వాత దేవతామూర్తులు మాడవీధుల్లో విహరిస్తూ ఆలయానికి చేరుకున్నారు.

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఈఓ భ్రమరాంబ సహా పెద్దసంఖ్యలో భక్తులు పాల‌్గొన్నారు. కృష్ణా మొవ్వలోని పురాతన బాలాత్రిపురసుందరి సమేత భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

బాపట్ల జిల్లా అప్పికట్ల కాశీ విశ్వేశ్వరస్వామి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవంలో... భక్తులు వివిధ రూపాల్లో సమర్పించిన కానుకలు లెక్కించారు. కోటి 73 లక్షల 67వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కోనసీమ జిల్లాముమ్మిడివరం శ్రీ భగవాన్ బాలయోగేశ్వరుల తీర్థాన్ని... తపోవనం నిర్వాహక కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఏటా మహాశివరాత్రి మరుసటి రోజు మాత్రమే చిన్న, పెద్ద బాలయోగేశ్వర్ల దివ్య సమాధులు ఉన్న తపోవనంను భక్తుల దర్శనార్థం తెరుస్తారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details