రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, పురపాలక ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో.. పార్టీలన్నీ తలమునకలయ్యాయి. కర్నూలు జిల్లాలోనూ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు సహా కాంగ్రెస్, భాజపా, జనసేన, వామపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన జడ్పీ పీఠాన్ని 20 ఏళ్ల తర్వాత జనరల్కు కేటాయించటంతో... బలమైన సామాజిక వర్గాల నుంచే గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పీఠం కోసం పోటాపోటీ...!
కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే చక్రం తిప్పుతాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా... 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వైకాపా అధికారం చేపట్టి 9 నెలలు గడిచిపోయింది. ప్రస్తుతం జనం ఎటువైపు మొగ్గుచూపుతారో అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో మొదలైంది. తాజాగా స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించి... మరోసారి సత్తా చాటాలని అధికార వైకాపా... తమ బలాన్ని నిరూపించుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.