ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 22, 2021, 9:29 AM IST

ETV Bharat / state

రాయలసీమలో రైతులు కష్టాలు.. పండించిన పంటంతా నేలపాలు.!

రైతులు సాగు చేసిన కూరగాయలకు కిలోకి రూపాయి రావడమే గగనమవుతోంది. వినియోగదారుడు మాత్రం బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.20పైగా చెల్లించి కొనాల్సి వస్తుంది. ఆరుగాలం శ్రమించే రైతు కష్టం దళారుల పాలవుతోంది. ప్రస్తుతం రాయలసీమలో టమాటా, పచ్చిమిర్చి ధరలు పతనమై రైతులకు కంట నీరు తెప్పిస్తున్నాయి.

tomato-and-green-chilli-prices-fall-in-rayalaseema
రాయలసీమలో రైతులు కష్టాలు.. పండించిన పంటంతా నేలపాలు.!

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో టమాటా రూ.2 పలుకుతుండగా అనంతపురంలో రూపాయి పలుకుతున్న పరిస్థితి. రాష్ట్రంలోనే టమాటాకు ప్రఖ్యాతి గాంచిన మదనపల్లిలో కిలో రూ.5 వరకు ఉంది. మదనపల్లి మార్కెట్‌లో ఒక్కో బాక్సు రూ.100 పలికితే.. రవాణా ఇతర ఖర్చులకు రూ.65 పోగా వందకు రూ.35 మాత్రమే మిగులుతోందని కర్నూలు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు

కర్నూలు జిల్లాలో పచ్చి మిర్చి 14,690 హెక్టార్లలో సాగైంది. ఎకరాకు రూ.35 వేలపైగా ఖర్చు చేశారు. దిగుబడి బాగా వచ్చినప్పటికీ వ్యాపారులు కిలోకి రూ.3లోపే ఇచ్చి కొంటున్నారు. కనీసం కూలీ కోత ఖర్చు రావడం లేదంటూ బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, సి.బెళగల్‌ పరిధిలో వందల ఎకరాల్లో పంటను రైతులు గొర్రెలకు వదిలేయగా.. మరికొందరు ట్రాక్టర్లతో దున్నేశారు.

అటు రైతులకు.. ఇటు వినియోగదారులకు..

ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధరలొచ్చేలా కర్ణాటక ప్రభుత్వం ‘హాప్‌కామ్‌’ (ఉద్యాన పంట మార్కెటింగ్‌ సహకార సంఘం) వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. దీని ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో పది చొప్పున, బెంగళూరులో వంద వరకు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో రిజిస్టర్‌ అయిన రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేస్తారు. అంతేకాక పండ్లు, టమాటా ప్రాసెసింగ్‌ చేస్తారు. రైతులకు ఇచ్చే ధరను ముందుగానే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరలు అందుబాటులో ఉంటున్నాయి.

కర్నూలు, అనంతలో అడుగులు

కర్నూలు జిల్లాలో టమాటా గుజ్జు పరిశ్రమకు అడుగులు పడుతున్నాయి. తాజాగా మొదటి ఫేజ్‌లో ప్యాపిలిలో టమాటా, పండ్లు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ 15 ఎకరాల్లో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు రూ.75 కోట్లు కేటాయించారు. ఉల్లి, కూరగాయల రైతుల సౌకర్యార్థం ప్రాసెసింగ్‌ యూనిట్‌ను దేవనకొండ మండలం ఈదుల దేవరబండలో రూ.75 కోట్లతో పది ఎకరాల్లో స్థాపించేందుకు నిర్ణయించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో డిఫెన్స్‌ ఫుడ్‌ రీసెర్చి లేబొరేటరీ ఆధ్వర్యంలో టమాటా ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. టమాటాతో కచప్‌, పచ్చళ్లు తయారుచేసేలా.. ప్రాసెసింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఇలా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తేనే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

కూలీ, రవాణా ఖర్చులూ రాక..

ఈ చిత్రంలోని రైతు పేరు రామాంజి. కర్నూలు జిల్లా ప్యాపిలి కలచాట్ల గ్రామానికి చెందిన ఈయన 3 ఎకరాల్లో రూ.70 వేల పెట్టుబడితో టమాటా సాగు చేశారు. ఇప్పటి వరకు మొత్తం కోతలపై రూ.10 వేలు కూడా చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 25 కేజీల బాక్సు రూ.40 పలుకుతోందని..కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోయారు.

ఇదీ చూడండి:ASSEMBLY: రాబోయే రెండున్నరేళ్లూ అచ్చెన్న, నిమ్మలకు మాట్లాడే అవకాశం ఇవ్వరట

ABOUT THE AUTHOR

...view details