ప్రమాదకరమైన కరోనా వైరస్ యన్440కె రకం కర్నూలులో పుట్టిందని, ఇది సాధారణ కరోనా కంటే 10 నుంచి 15 రెట్లు తీవ్రంగా వ్యాప్తి చెంది మానవ నష్టం జరుగుతుందని ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి శిదిరి అప్పలరాజు వ్యాఖ్యలు చేయడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు పలువురు మానసిక ఒత్తిడికి గురై చనిపోవడానికి దారి తీశాయని ఆరోపిస్తూ కర్నూలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో తెదేపా నాయకులు పోతురాజు రవికుమార్, మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ధరూర్ జేమ్స్ అలియాస్ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు స్టేషన్లో న్యాయవాది జయన్న ఆదివారం ఫిర్యాదు చేశారు.
17:01 May 09
సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యే విధంగా మంత్రి వాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారని, ఇతర ప్రాంతాల వాసులు కర్నూలుకు రావడానికి భయపడుతున్నారని ఆరోపించారు. ఒడిశా, దిల్లీ ప్రభుత్వాలు వారి రాష్ట్రాల్లోకి రాకుండా నిషేధిస్తూ నిబంధనలు విధించాయన్నారు. యన్440కె అంత ప్రమాదకారి కాదని సీసీఎంబీ తేల్చి చెప్పిందన్నారు. యన్440కె వైరస్ కర్నూలులో పుట్టిందని చంద్రబాబు ఆరోపించడంతో జనం భయపడుతున్నారని న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆదివారం తెదేపా నాయకులు మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేయడం వివాదాలకు దారి తీసింది.
ఇదీ చదవండి:
హైదరాబాద్కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం!