‘రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం. నివర్ తుపాను, వర్షాల వల్ల తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేస్తాం..!’ జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి కొడాలి నానిలు ఇచ్చిన హామీ ఇది.
రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు మార్గదర్శకాలు వచ్చాయి. క్వింటాకు రూ.94 తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం 10శాతంలోపు రంగు మారిన గింజలు ఉంటేనే కొంటారు. కృష్ణాజిల్లా పెడన మండలం పెనుమల్లికి చెందిన మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ గరికపాటి చారుమతి తన పొలంలో పండించిన ధాన్యం పీపీసీకి తీసుకెళ్తే.. కొనుగోలు చేయబోమని తిరస్కరించారు. 10 శాతం కంటే ఎక్కువ రంగు మారిందని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన అజ్జా నాగేశ్వరరావు, శంకరరావు ధాన్యం కూడా తిరస్కరించడంతో అమ్ముకోలేని పరిస్థితి.
పామర్రు మండలం పసుమర్తి గ్రామానికి చెందిన రైతు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత చెబుతామని కొనుగోలు కేంద్రంలో తిప్పిపంపారు. ధాన్యం వ్యాపారి దగ్గరకు వెళ్తే ఇతర ప్రాంతాల ధాన్యం అనుమతించడంలేదని నిరాకరించాడు. యలమంచిలి చిదంబర సీతారామారావు 10 ఎకరాలు సాగు చేశారు. అమ్ముడుపోక పది రోజుల నుంచి కల్లంలోనే ధాన్యం ఉంది. తడిసిన ధాన్యం రంగు మారడం సహజం. కానీ పది శాతం నిబంధన పెట్టడంతో రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. రాష్ట్రం దాటి ధాన్యం రవాణా చేయకూడదనే షరతు ఉంది. దాదాపు 82,192 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.