ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమూల్​ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం

By

Published : Jul 20, 2020, 10:50 PM IST

Updated : Jul 21, 2020, 12:16 AM IST

రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమూల్​తో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో మహిళా పాడి రైతులను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకువచ్చేందుకు ఒప్పందం చేసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు.. అధికారులు అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు.

cm jagan review
cm jagan review

ఆంధ్రప్రదేశ్​లో పాడిపరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అమూల్ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ ఒప్పందం దృష్ట్యా.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ వాణీ మోహన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అవగాహన ఒప్పందంలోని అంశాలను సీఎంకు అధికారులు వివరించారు.

ఈ ఒప్పందం మహిళల సాధికారతకూ తోడ్పాటునిస్తుందని సీఎం అన్నారు. మొత్తంగా డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుందన్న సీఎం జగన్.. పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ.. విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్సార్‌ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. మహిళలు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడిపరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ఆ పరిశ్రమల్లో వారికున్న అవకాశాలను పరిశీలించి మహిళలను ముందుకు నడిపించాలన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 4,074 కరోనా కేసులు, 54 మరణాలు

Last Updated : Jul 21, 2020, 12:16 AM IST

ABOUT THE AUTHOR

...view details