రాష్ట్రంలో క్రమంగా కరోనా తీవ్రత తగ్గుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు పెరుగుతోందని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. ప్రస్తుతం ఏపీలో కరోనా రోగుల రికవరీ రేటు 91 శాతంగా ఉందని.. త్వరలోనే ఇది 99 శాతానికి పెరుగుతుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల ఖాళీలు పెరుగుతున్నాయన్నారు. ఆక్సిజన్ వినియోగం కూడా గణనీయంగా తగ్గిందని.. ప్రస్తుతం 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వినియోగం అవుతోందన్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల నుంచి 11 వేలకు తగ్గిందని అనిల్ సింఘాల్ తెలిపారు. తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం సహా ఇతర జిల్లాల్లోనూ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆయన వివరించారు.
మరోవైపు కొవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగానే అమలవుతోందని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఛార్జీ చేస్తున్నారనే అంశంపై విజిలెన్సు అధికారులు తనిఖీ చేసి.. మొత్తం రూ.9.90 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు వెల్లడించింది.